ఏపీలో మున్సిపల్ సమ్మె తాత్కాలిక విరమణ-సోమవారంలోగా ఒప్పందం రాకపోతే మళ్లీ..
ఏపీలో 9 కీలక డిమాండ్లతో సమ్మె ప్రారంభించిన 35 వేల మంది కార్మికులు ఇవాళ మెట్టు దిగారు. ప్రభుత్వం నిన్న వారికి వేతనాలు పెంచుతున్నట్లు చేసిన ప్రకటన నేపథ్యంలో ఇావాళ ఉదయం వారు తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రభుత్వం మాట నిలబెట్టుకోకపోతే మాత్రం తిరిగి సమ్మెకు దిగుతామని ప్రకటించారు.
రెండు రోజుల క్రితం ఏపీలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్యం క్షీణించింది. ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయింది. మరోవైపు వర్షాలు కూడా కురుస్తుండటంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఏర్పడింది. దీంతో స్పందించిన ప్రభుత్వం నిన్న మున్సిపల్ కార్మికుల వేతనాల్ని 18 వేల నుంచి 21 వేలకుపెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే వారికి ఇస్తున్న అలవెన్స్ కూడా యథాతథంగా కొనసాగిస్తామని మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఇవాళ చర్చించిన మున్సిపల్ జేఏసీ నేతలు తమ సమ్మెను తాత్కాలికంగా విరమించాలని నిర్ణయించారు. అయితే సోమవారంలోగా తమకు ఇచ్చిన హామీల అమలుపై రాతపూర్వకంగా అగ్రిమెంట్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇందులో విఫలమైతే మాత్రం సోమవారం నుంచి తిరిగి సమ్మెలోకి వెళ్తామని మున్సిపల్ కార్మికుల జేఏసీ నేతలు ప్రకటించారు. దీంతో ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంటోంది. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పారిశుద్ధ్య పరిస్ధితులు ఇప్పటికే క్షీణిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.