బీహార్ బాటలో ఏపీ ముస్లింలు ? చంద్రబాబుకు షాకిస్తారా ?
ముస్లింలు పవిత్ర మాసమైన రంజాన్ ఉపవాసాల్లో బిజీగా ఉన్నారు. ఏపీలోనూ ముస్లింల రంజాన్ ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో ఓ కీలక అంశంలో ముస్లింలు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీపైనా దీని ప్రభావం పడుతోంది. ముఖ్యంగా పార్లమెంట్ లో కేంద్రం తీసుకురాబోతున్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు టీడీపీ మద్దతుగా నిలుస్తుండటంపై ముస్లిం వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో ఈ నెల 27 అంటే రేపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు ఇస్తున్న ఇఫ్తార్ పార్టీని బహిష్కరించేందుకు ముస్లిం వర్గాలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఇవాళ కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమయ్యాయి. దేశంలో ముస్లింల ఆస్తుల స్వాధీనానికి కేంద్రం తెస్తున్న వక్ఫ్ బిల్లుకు మద్దతిస్తున్న టీడీపీకి షాకిచ్చేందుకు ముస్లిం వర్గాలు నిర్ణయం తీసుకోబోతున్నాయి. ఈ మేరకు చంద్రబాబు ఇఫ్తార్ పార్టీని బహిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు బీహార్ లో ఎన్డీయే భాగస్వామి నితీష్ కుమార్ ఇచ్చిన ఇఫ్తార్ పార్టీని కూడా ముస్లింలు బహిష్కరించారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిన్న ఏపీలోనూ గుంటూరులో ముస్లింలు పెద్ద ఎత్తున వక్ఫ్ బిల్లుపై నిరసన తెలిపారు. ఈ నెల 29న విజయవాడలోనూ నిరసనలకు ముస్లింలు పిలుపునిచ్చారు.ఈ క్రమంలో వక్ఫ్ బిల్లుకు అండగా నిలుస్తున్న టీడీపీకి బుద్ధి చెప్పాలంటే బీహార్ బాటలోనే ఏపీలోనూ ప్రభుత్వ ఇఫ్తార్ పార్టీ బహిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications