ఏపీకి మరో కేంద్ర మంత్రి పదవి - కొత్త సమీకరణం..!?
ప్రధాని మోదీ తన మంత్రివర్గ విస్తరణకు సమాయత్తం అవుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక పూర్తి కావటంతో.. ఇప్పుడు బీజేపీ జాతీయాధ్యక్షుడు, ఆ తరువాత మంత్రివర్గ విస్తరణ దిశగా కార్యాచరణ కొనసాగుతోంది. అందులో భాగంగా ఏపీకి మరో మంత్రి పదవి దక్కనుందని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నుంచి ఒకరు, టీడీపీ కి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు మరో అవకాశం రావటంతో... ఏ పార్టీ నుంచి ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇక్కడ.. చంద్రబాబు, పవన్ నిర్ణయం కీలకంగా మారనుంది.
ఛాన్స్ దక్కేదెవరికి
ఏపీకి మరో కేంద్ర మంత్రి పదవి దక్కనుంది. త్వరలో బీహార్ ఎన్నికలు జరగనుండగా.. ఆ తరువాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లోనూ ఎన్నికలకు సమయం సమీపి స్తోంది. దీంతో.. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ అధినాయకత్వానికి ప్రతిష్ఠాత్మకంగా మారుతు న్నాయి. ఈ రెండు రాష్ట్రాల కు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత దక్కనుంది. తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామైలకు కేంద్ర మంత్రి పదవి దాదాపు ఖాయమైంది. కేంద్రంలో టీడీపీ నుంచే ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. జనసేన నుంచి అప్పట్లో అవకాశం ఇచ్చినా.. పవన్ ఆసక్తి చూపలేదు. టీడీపీకి ఒక కేంద్ర మంత్రి, మరొకటి సహాయ మంత్రి పదవి దక్కాయి. ఏపీ కేబినెట్ లో బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు.

సమీకరణాలు
కాగా, ఇప్పుడు మారుతున్న సమీకరణాల్లో భాగంగా కేంద్ర కేబినెట్ లో ఏపీకి మరో బెర్తు ఇచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏపీ కేబినెట్ లోనూ బీజేపీకి మరో మంత్రి పదవి పైన ప్రతిపాదన చేసినట్లు సమాచారం. కొత్తగా దక్కే మంత్రి పదవి పైన టీడీపీ, జనసేనలో ఎవరికి దక్కుతుందనేది చంద్రబాబు - పవన్ తీసుకునే తుది నిర్ణయం మేరకు ఉంటుందని తెలుస్తోంది. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి. కేంద్ర కేబినెట్ లో మంత్రి పదవి తీసుకోవాలని పవన్ తాజా ఆలోచనగా తెలుస్తోంది. పవన్ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. కాగా, అందులో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్. నాగబాబును రాష్ట్రంలో కాకుండా కేంద్ర మంత్రిగా పంపించే ప్రతిపాదన పైన పవన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
రేసులో ఉన్నదెవరు
ప్రస్తుతం ఉత్తరాంధ్ర.. కోస్తా జిల్లాలకు కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కింది. దీంతో, ప్రాంతీయ - సామాజిక సమీకరణాల్లో భాగంగా రాయలసీమ నుంచి బీసీ లేదా ఎస్సీ వర్గానికి అవకా శం ఇవ్వాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఇందులో చిత్తూరు, హిందూపూర్ ఎంపీల్లో ఒకరికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో సీమ నుంచి రెడ్డి వర్గానికి అవకాశం పైనా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రెడ్డి వర్గానికి ఇస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ప్రధానంగా రేసులో వినిపిస్తోంది. జనసేనకు దక్కితే బాలశౌరి పేరు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. బీజేపీ తీసుకుంటే పురందేశ్వరి లేదా సీఎం రమేశ్ లో ఒకరిని ఎంపిక చేస్తారా అనే చర్చ జరుగుతోంది. దీంతో.. దసరా తరువాత కేంద్ర కేబినెట్ లో ఏపీ నుంచి కొత్తగా ఎవరికి అవకాశం వస్తుందనేది అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications