భూములకు రెక్కలు: అమరావతి జిల్లా పేరిట ప్రత్యేక రిజిస్ర్టార్ కార్యాలయం..!
అమరావతి: ఏపీ రాజధానిలో కొత్తగా అమరావతి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంగా ఏర్పాటు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని భూములకు భారీ ధరలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాజధాని పరిధిలోని భూములు, స్ధిరాస్తుల క్రయ విక్రయాలు భారీగా జరుగుతాయనే ఉద్దేశ్యంతో అమరావతి పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ కొత్త రిజిస్ట్రార్ కార్యాలయం విషయంలో ప్రభుత్వం రెండు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఒకటి రాజధాని ప్రతిపాదిత 29 గ్రామాలతో సంబంధం కలిగి ఉన్న మంగళగిరి, తాడికొండ, అమరావతి సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలను కలిపి అమరావతి రిజిస్ట్రేషన్ జిల్లాగా చేయడం.
మొదటి ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరిస్తే, జిల్లా రిజస్ట్రార్ అధికారి హోదాతో తుళ్లూరులో ఏర్పాటు చేయాలని రిజిస్ర్టేషన్ ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. ఒక వేళ ప్రభుత్వం ఏదైనా మార్పులు సూచిస్తే జిల్లా కార్యాలయాన్ని మంగళగిరిలో పెట్టాలని యోచించారు.
రెండోది రాజధాని ప్రతిపాదిత గ్రామాల ప్రజలకు మరింత సౌలభ్యం కోసం ప్రత్యేకంగా నాలుగు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలను ఏర్పాటు చేయడం. తుళ్లూరు, అనంతవరం, మందడం, ఉండవల్లిలలో సబ్రిజిస్ర్టార్ కార్యాలయాలను ఏర్పాటు చేసి వాటి పరిధిలోని గ్రామాలను ఆయా కార్యాలయాల పరిధిలోకి తేవాలని భావిస్తున్నట్లు రిజిస్ర్టేషన్ వర్గాల ద్వారా తెలిసింది.