తొలి సమీక్ష లోనే జగన్కు షాక్: ఇలా చేసారేంటంటూ విస్మయం: సీఎం చెప్పిందిదే..!
ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్కు షాక్ తగిలింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి సారిగా ఆర్థిక, రెవెన్యూ శాఖలపై సమీక్ష చేసారు. ఆ సమయంలో అధికారులు చెప్పిన వివరాలు విని..గత ప్రభుత్వ నిర్వాకాల పైన షాక్ అయ్యారు. కార్పోరేషన్ల పేరుతో అధిక వడ్డీలకు రుణాలు సేకరించి...రాజకీయ అవసరాలకు మళ్లించటం పైన అధికారులు వివరించారు. దీంతో....జగన్ ఒక్క సారిగా విస్తుపోయారు.
ఆర్దిక క్రమశిక్షణ తప్పనిసరి..
ఆర్దికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీలో అర్దిక వ్యవస్థ అదుపులోకి రావాలంటే ఆర్దిక క్రమశిక్షణ తప్పదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు. అస్తవ్యస్థంగా ఉన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చక్క దిద్దడానికి సృజనాత్మక ఆలోచన విధానాలతో రావాలని ఆయన కోరారు. ఏపీకీ ప్రత్యేక హోదా కోసం త్వరలో రానున్న 15వ ఆర్ధిక సంఘం ముందు సమర్థవంతంగా ఆంధ్రప్రదేశ్ తన వాదన వినిపించాలని సూచించారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితిని మరింత మెరుగు పరిచేలా చర్యలు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సామాన్యునిపై భారం పడకుండా రాష్ట్ర ఆదాయ వనరుల పెంపునకు ప్రణాళికలు రూపొందించాల్సిందిగా అధికారులకు సూచనలు చేశారు. ఈ దిశగా హరిత పన్ను (గ్రీన్ టాక్స్), వ్యర్థ పదార్థాలపై పన్ను, ఎర్ర చందనం అమ్మకం, తక్కువ వడ్డీకే రుణాలు పొందడం, సరయిన ఇసుక విధానం అమలు వంటి చర్యలు ద్వారా ఆదాయాన్ని పెంచే యోచన చేయాలన్నారు.
బెల్టు షాపులను పూర్తిగా తొలిగించండి..
ఏపీలో ఎక్కడా బెల్టు షాపు లేకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎక్కడయినా బెల్ట్ షాప్ కనిపిస్తే.. దానిపై చర్యలు తీసుకుంటూనే, దానికి మద్యం సరఫరా చేసిన వైన్ షాప్ లైసెన్స్ రద్దు చెయ్యాలని ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ అక్రమాలు జరిగినా మరింత కఠినతరమైన నిబంధనలు అమలు చేయాలని, దశల వారి మద్యపాన నిషేధం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చైతన్యం, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక, ఏపీలో ఎన్నికల ముందు నాటి ప్రభుత్వం ఏ రకంగా నిధులు సమీకరించిందీ..ఏ రకంగా వాటిని పక్క దారి పట్టించిందీ అధికారులు వివరించారు. ఏపీలో గత అయిదేళ్ల కాలంలో చేసిన అప్పుల గురించి..ఓడికి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని సీఎం ఆరా తీసారు.
రాజకీయాల కోసం నిధుల మళ్లింపు..
గత ప్రభుత్వం చివర్లో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ నిధులను ఇష్టా రాజ్యంగా దుర్వినియోగం చేసిందని సమీక్షలో తేల్చారు. కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీ పెట్టి, అప్పులు తీసుకుని, వాటిని దారి మళ్లించిన వైనాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వారు చెప్పిన వివరాలను చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివ్వెరపోయారు. ఎన్నికల ముందు గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా ఇంతలా వాడేసారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. త్వరలోనే రాష్ట్రంలో ఆర్దికంగా నెలకొన్ని వాస్తవ పరిస్థితుల పైన శ్వేత పత్రం విడుదల చేద్దామని జగన్ పేర్కొన్నారు.