రాజధాని బిల్లుల రద్దును స్వాగతించిన విపక్షాలు-అమరావతికే కట్టుబడాలన్న రైతులు-రియాక్షన్స్ ఇవే
ఏపీలో మూడు రాజధానుల బిలుల్ని వెనక్కి తీసుకోవాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని విపక్షాలు మాత్రం స్వాగతించాయి. మూడు రాజధానుల బిల్లుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై విపక్ష టీడీపీ, బీజేపీతో పాటు అమరావతి జేఏసీ కూడా స్వాగతించాయి. అయితే ప్రభుత్వం ఇకనైనా అమరావతి రాజధానికి కట్టుబడి ఉండాలని సూచిస్తున్నాయి.

మూడు రాజధానుల బిల్లుల రద్దు
ఏపీలో మూడు రాజదానుల ఏర్పాటు కోసం రెండేళ్ల క్రితం వైసీపీ సర్కార్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీయే చట్టం రద్దు కోసం రెండు బిల్లుల్ని ప్రవేశపెట్టింది. ఈ రెండు బిల్లుల్ని అసెంబ్లీలో రెండుసార్లు నెగ్గించుకున్న వైసీపీ ప్రభుత్వం.. మండలిలో మాత్రం మెజారిటీ లేకపోవడంతో చుక్కెదురైంది. మండలి సెలెక్ట్ కమిటీకి బిల్లుల్ని పంపడంతో తమకున్న అధికారంతో వాటిని గవర్నర్ ఆమోదముద్ర వేయించేసుకున్న వైసీపీ సర్కార్.. వాటిని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నించింది. దీనిపై హైకోర్టులో వరుసగా పిటిషన్లు పడటంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇన్నాళ్లూ దీనిపై హైకోర్టులో పోరాడుతూ వచ్చిన వైసీపీ సర్కార్.. ఇవాళ వాటిని ఉపసంహరించుకోవాలని కేబినెట్లో నిర్ణయం తీసుకుంది.

స్వాగతించిన విపక్షాలు
మూడు రాజధానుల బిల్లుల్ని వెనక్కి తీసుకుంటూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విపక్షాలు స్వాగతించాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మనసు మారినందుకు సంతోషమని తెలిపాయి. రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకోవడంపై విపక్ష టీడీపీ, బీజేపీ, సీపీఐతో పాటు అమరావతి జేఏసీ, రైతులు కూడా స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాల్ని కూడా ప్రభుత్వానికి సూచించాయి. దీంతో ఇప్పుడు విపక్షాల స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.

మా బాటలోకే జగన్ అన్న టీడీపీ
ఏపీలో మూడు రాజధానుల బిల్లుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై టీడీపీ ఎమ్మెల్యే, సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి స్పందించారు. మూడు రాజధానులు బిల్లు వైసీపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం సంతోషకరమన్నారు. రాష్ట్రానికి అమరావతి అన్ని విధాలా సరైన రాజధాని అని ఆయన తెలిపారు. టీడీపీ అన్ని ప్రాంతాల అబివృద్ది కి కట్టుబడి ఉందన్నారు. ఇప్పుడు వైసీపీ కూడా అదే విషయాన్ని చెబుతోందన్నారు. రాజధాని రైతులను పెయిడ్ అరిస్టులు అన్నారని బుచ్చయ్య గుర్తుచేశారు. రాష్ట్రానికి ఓకే రాజధాని ఉండాలని బుచ్చయ్య సూచించారు.

పాదయాత్ర కొనసాగుతుందన్న అమరావతి జేఏసీ
మూడు రాజధానుల బిల్లులపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అమరావతి జేఏసీ ప్రకటించింది.ప్రజావ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని జేఏసీ నేతలు చెప్పారు. ఇకనైనా అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలని వారు కోరారు. ఇన్నాళ్లూ అమరావతిని విమర్శించినవాళ్లు క్షమాపణ చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు. అమరావతే రాజధానిగా ఉండాలంటూ చేపట్టిన మహాపాదయాత్ర కొనసాగుతుందని అమరావతి జేఏసీ ప్రకటించింది.

ఉద్యమ విజయమన్న సీపీఐ
ఏపీలో మూడు రాజధానులు బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవడం హర్షణీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిరారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గత 705 రోజులుగా నిర్విరామంగా సాగుతున్న పోరాటానికి ఇది తొలి విజయమన్నారు. అమరావతి రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగిస్తూ వైసీపీ సర్కార్ ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నట్లు రామకృష్ణ తెలిపారు.

మళ్లీ మూడు ముక్కలాట వద్దన్న బీజేపీ
మూడు రాజధానుల బిల్లుల ఉవసంహరణ నిర్ణయాన్ని విపక్ష బీజేపీ కూడా స్వాగతించింది. మళ్లీ మూడు లేదా నాలుగు ముక్కలాట ఆడమని సీఎం జగన్ గారు ప్రకటించాలని బీజేపీ నేత లంకా దినకర్ తెలిపారు. అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని విస్పష్టంగా ప్రకటించాలన్నారు. అమరావతి రాజధాని కోసం తాను హైకోర్టులో వేసిన పిటిషన్ సరైనది అనే ఆనందం ఉందని లంకా దినకర్ వెల్లడించారు. భూములు ఇచ్చిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం CRDA చట్టం ద్వారా ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications