పంచాయతీ ఎన్నికల్లో ఇంత దారుణాలా?: వైసీపీపై చంద్రబాబు తీవ్ర విమర్శలు
అమరావతి: పంచాయతీ ఎన్నికలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది అంటూ టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం అమరావతిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే స్థాయికి వైసీపీ చేరిందన్నారు.

భయపెట్టి బలవంతపు ఏకగ్రీవాలా?
రాష్ట్ర వ్యాప్తంగా బలవంతపు ఏకగ్రీవాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి పనులు చేయడం దారుణమన్నారు. అభ్యర్థులను భయపెట్టి నామినేషన్ వేయకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులున్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు ముందుకొచ్చారన్నారు. అందుకు వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు.

వైసీపీ పతనానికి నాంది పంచాయతీ ఎన్నికలే: చంద్రబాబు
మొదటి రెండు దశల్లో జరిగిన ఓట్ల శాతాన్ని చూస్తే.. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైనట్లు స్పష్టంగా తెలుస్తోందని చంద్రబాబు అన్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 39 శాతానికిపైగా స్థానాల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థులే గెలిచారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వైసీపీ ఎంపీలు, మంత్రులకు కంచుకోటగా చెప్పుకునే స్థానాల్లోనూ టీడీపీ సత్తా చాటిందని చెప్పుకొచ్చారు. అనేక చోట్ల రీకౌంటింగ్ కోరితే తిరస్కరించారని తెలిపారు. అయితే, వైసీపీ నేతలు అడిగినవెంటనే రీకౌంటింగ్ కు అనుమతించారన్నారు.

ఏజెంట్లను బయటికి పంపి అక్రమాలు..
తన జీవితంలో తొలిసారి పంచాయతీ ఎన్నికలను సమీక్షించానని, తమ చొరవతోనే 82 శాతం పోలింగ్ నమోదైందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఏజెంట్లను బయటకు పంపి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కౌంటింగ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరామని తెలిపారు. అక్రమాలకు కొమ్ముకాసే అధికారులపై చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు.
Recommended Video

వాలంటీర్లతో ప్రచారాలా?.. వైసీపీ అరాచకాలపై..
వైసీపీ ఎమ్మెల్యేలు వాలంటీర్లతో ప్రచారం చేయిస్తున్నారన్నారు. అధికార వైసీపీ నాయకుల వ్యవహార శైలి, అరాచకాలపై ప్రజలు నిలదీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఎన్ని రకాలుగా భయపెట్టినా ప్రజలు ధైర్యంగా ఎదుర్కొన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మూడోదశ పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజుల అదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. ఎస్ఈసీ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కాగా, ఒకటి, రెండో దశ పంచాయతీ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. రెండు విడతల్లోనూ అధికార వైసీపీ మెజార్టీ పంచాయతీ స్థానాలను కైవసం చేసుకోగా, టీడీపీ రెండో స్థానంలో నిలిచింది.












Click it and Unblock the Notifications