జగన్vsనిమ్మగడ్డ: కొత్తగా యాప్ లొల్లి -ఎస్ఈసీపై సజ్జల సంచలన ఆరోపణలు -మహిళను వివస్త్ర చేస్తే..
ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్, జగన్ సర్కారుకు మధ్య వివాదాలు మరింతగా ముదిరాయి. ఇప్పటికే పలు అంశాల్లో ఇరు వర్గాలు తీవ్ర ఆరోపణలు, వాదోపవాదాలకు దిగుతుండగా, కొత్తగా ఎన్నికల యాప్పై చిచ్చు రాజుకుంది. ప్రభుత్వం అందించిన డేటాను కాదని ఎస్ఈసీ సొంతగా యాప్ రూపొందించడంపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన సజ్జల.. నిమ్మగడ్డ జిల్లాల పర్యటనలపైనా విమర్శలు చేశారు.
జగన్ వల్ల జనంలో సోమరితనం -దాన్ని మోదీ సహించరు -అందుకే కేంద్ర బడ్జెట్లో ఏపీకి సున్నా: వైసీపీ ఎంపీ
నిమ్మగడ్డ సొంత యాప్!
ఏపీలో పంచాయితీ ఎన్నికలపై ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజలకు సమగ్ర సమాచారం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక యాప్ ను రూపొందించింది. దీన్ని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బుధవారమే లాంఛ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రభుత్వం ఇచ్చిన డేటాను కాదని, నిమ్మగడ్డ సొంతగా యాప్ తయారుచేసుకోవడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే వైసీపీ తరఫున అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఎస్ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సజ్జల ఆరోపించారు.
ఎస్ఈసీ యాప్ను నమ్మలేం
''తనకున్న అధికారల మేరకు ఎస్ఈసీ.. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతోనే పని చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇదే ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు పక్కాగా సేకరించిన డేటా ఆధారంగా ప్రభుత్వమే ఒక ఎన్నికల యాప్ తయారు చేసింది. కానీ దాన్ని నిమ్మగడ్డ తిరస్కరించారు. ప్రభుత్వ డేటాను కాదని, ఆయన తన సొంత డేటాతో యాప్ తీసుకురావడంపై మాకు అనుమానాలున్నాయి. కావాలనుకుంటే ఏపీ ప్రభుత్వ యాప్ ను నిపుణులతో టెస్టు చేయించైనా వాడాలి. లేదా.. నేషనల్ ఇన్ఫార్మాటిక్ సెంటర్ వారు కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిచ్చిన సీవీజీలను ఉపయోగించాలి. ఈ రెండిటినీ కాదని, ఎలాంటి పారదర్శకత లేకుండా, డేటా సేఫ్టీపై భరోసా లేకుండా, నిమ్మగడ్డ సొంతగా లాంచ్ చేయబోతోన్న యాప్ ను నమ్మడానికి వీల్లేదు'' అని సజ్జల పేర్కొన్నారు.
టీడీపీ కనుసన్నల్లో కొత్త యాప్?
ఎస్ఈసీ నిమ్మగడ్డ అడుగడుగునా అనుసరిస్తోన్న టీడీపీ అనుకూల విధానాలను బట్టి చూస్తే, ఎన్నికల కోసం రూపొందించిన యాప్ కూడా టీడీపీ కనుసన్నల్లోనే తయారై ఉండొచ్చనేలా వైసీపీ నేత సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు కొత్త యాప్ తయారు చేయలేము కాబట్టి.. ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసిన యాప్ ను నిపుణులతో పరీక్షించయినా వాడుకోవాలని, లేదా కేంద్ర ఎన్నికల సంఘం యాప్ లనైనా వాడాలని సజ్జల సూచించారు. 'జగన్ వర్సెస్ నిమ్మగడ్డ' అన్నట్లుగా సాగుతోన్న వివాదాల్లో కొత్తగా యాప్ పంచాయితీ వెలుగులోకి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే..
నిమ్మగడ్డకు నిమ్మాడ కనిపించట్లేదా?
ఎస్ఈసీ ఎన్నికల యాప్ పై అనుమానాలు వ్యక్తం చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి.. మరోసారి నిమ్మగడ్డపై తీవ్ర విమర్శలు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ అభ్యర్థి భర్త చనిపోతే, ఆ ఇంటికెళ్లి పరామర్శించిన నిమ్మగడ్డ.. టీడీపీ దౌర్జన్యాలతో అట్టుడుకుతున్న నిమ్మాడ(శ్రీకాకుళం జిల్లా) గ్రామానికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడి ఆదేశాలతో నిమ్మాడలో టీడీపీ శ్రేణులు అరాచకాలకు పాల్పడుతున్నాయని, వైసీపీ బలపర్చిన అభ్యర్థి అప్పన్నను నామినేషన్ వేయకుండా దౌర్జన్యానికి దిగారని, ఇలాంటి ఘటనలను చూసి చూడనట్లు వదిలేస్తుండటాన్ని బట్టి నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడనే విషయం మరోసారి రుజువైందని సజ్జల అన్నారు. గతంలో నిమ్మాడలో ఓ మహిళను టీడీపీ నేతలు వివస్త్రను చేశారని గర్తు చేశారు.
చంద్రబాబు భయానక కుతంత్రం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తోన్న ప్రభుత్వం.. ప్రలోభాలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలనుకుంటోందని, టీడీపీ మాత్రం ఎన్నికల సందర్భంగా ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలని ప్రయత్నిస్తోందని సజ్జల ఆరోపించారు. నిన్నటిదాకా ఆలయాలపై దాడులంటూ ఆందోళనలను చేసిన చంద్రబాబు.. విగ్రహాలు ధ్వంసం చేసింది టీడీపీ వాళ్లే అని రుజువులతో బయటపడేసరికి ట్రాక్ మార్చారని, కులాల మధ్య చిచ్చులు పెట్టేందుకు భయానక కుతంత్రాలకు పాల్పడుతున్నారని సజ్జల ఆరోపించారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ను పక్కదారి పట్టించేందుకే విజయవాడలో తన నేతలపై దాడులంటూ టీడీపీ డ్రామాలకు తెరతీసిందని, దాడులకు పాల్పడినవారే బాధితులుగా బిల్డప్ ఇవ్వడమనే నైజం చంద్రబాబుదే అని సజ్జల విమర్శించారు.
Recommended Video
నిమ్మగడ్డ మార్కు: 2,386 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ,2,245 వార్డు మెంబర్లవి కూడా