నిమ్మగడ్డకే ఆ నమ్మకం లేదు: సుప్రీం అనుమతి ఇచ్చినా: చంద్రబాబు వాడకం అది: వెంకట్రామిరెడ్డి
అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తనపై డీజీపీ గౌతమ్ సవాంగ్కు ఫిర్యాదు చేయడాన్ని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ కాకర్ల వెంకట్రామి రెడ్డి తప్పు పట్టారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగే పరిస్థితి లేకపోవడం వల్లే నిమ్మగడ్డ తీవ్ర అసహనానికి గురవుతున్నారని విమర్శించారు. ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం నిమ్మగడ్డకే లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగబోవనే విషయం ఆయనకూ తెలుసునని వ్యాఖ్యానించారు. ఎన్నికల నిర్వహణను అడ్డుగా పెట్టుకుని రాష్ట్రంలో అలజడి సృష్టించడానికే నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ఓటర్ల జాబితా లేదు.. నామినేషన్ పత్రాలు లేవు..
ఆదివారం ఆయన సమాఖ్య నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకుని రావాలనే ఉద్దేశంతోనే నిమ్మగడ్డ ఉన్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్ల పరిధులు తెలియకుండా.. ఓటర్ల జాబితా లేకుండా..నామినేషన్ పత్రాలు లేకుండా నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అవేవీ లేకుండా ఎన్నికలను ఎలా నిర్వహించగలుగుతారని అన్నారు. ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ.. నామినేషన్ పత్రాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారని నిలదీశారు. మనసులో ఏదో పెట్టుకుని ఏదో చేయబోతోన్నారని అన్నారు.
బలయ్యేది ఉద్యోగులేనా?
ప్రభుత్వంతో జరిగే పోరాటంలో బలయ్యేది ఉద్యోగులేనని అన్నారు. అన్నీ సిద్ధంగా ఉన్నప్పుడు, కరోనా రహిత వాతావరణంలో ఎందుకు ఎన్నికలను నిర్వహించడానికి ముందుకు రాలేదని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. కరోనా వల్ల విధుల్లో పాల్గొనలేని ఉద్యోగులను మినహాయించి, మిగిలిన వారితో ఎందుకు నిర్వహించుకోలేరని అన్నారు. సిద్ధంగా ఉన్న వాళ్లతో ఎన్నికలు పెట్టుకోమనే తాము అడుగుతున్నామని చెప్పారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల కమిషన్కు లేఖ రాయాలని వెంకట్రామి రెడ్డి సూచించారు.
వ్యాక్సిన్ ఇచ్చిన తరువాతే..
రక్షణ అనేది ఎలా కల్పిస్తారని వెంకట్రామిరెడ్డి చెప్పారు. వ్యాక్సిన్ అనే రక్షణ ఇచ్చిన తరువాత ఎన్నికలను పెట్టుకోండి అని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో దీక్షల పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను ఇష్టానుసారంగా వినియోగించుకున్నారని వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ధర్మ పోరాట దీక్ష, నవ నిర్మాణ దీక్షల పేరుతో తమను తెలుగుదేశం పార్టీ నేతలు ఇష్టానుసారంగా వాడుకున్నారని, తమపై శారీరకంగా, మానసికంగా అనేక ఒత్తిళ్లను తీసుకొచ్చారని అన్నారు. అలాంటి టీడీపీ నేతలకు తమ గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పారు.
నిమ్మగడ్డ మీదే నిఘా..
కొందరు టీడీపీ నేతలు ఇష్టానుసారంగా తనను వాడూ వీడూ అంటున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను కూడా టీడీపీ నేతలను అరేయ్ ఒరేయ్ అనలేనా?,. ఒళ్లు బలిసి కొట్టుకుంటున్నావని అనలేనా? అని వెంకట్రామిరెడ్డి అన్నారు. తాము ఎవరినీ బెదిరించ లేదని నిమ్మగడ్డను బెదిరించాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. నిఘా తన మీద కాదు.. నిమ్మగడ్డ మీద పెట్టాలని ఆయన పోలీసులకు సూచించారు. ఎన్నికల కార్యాలయం ఉద్యోగులను నిమ్మగడ్డ ఉద్దేశపూరకంగా టార్గెట్ చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరపకుంటే రాష్ట్రానికి వచ్చిన నష్టమేంటి అని అన్నారు.