అడ్డంగా దొరికిన నిమ్మగడ్డ -టీడీపీ ఆఫీసులోనే యాప్ -అందుకే కోడ్ చెప్పట్లేదు: వైసీపీ సంచలన ఆరోపణ
ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళుతున్న కొద్దీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్పై అధికార వైసీపీ నేతల విమర్శలు, ఆరోపణలు తీవ్రతరం అవుతున్నాయి. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవ పంచాయితీలను వెంటనే ప్రకటించరాదన్న నిమ్మగడ్డ ఆదేశాలు.. ఎన్నికల్లో అక్రమాల నిరోధానికి ఎస్ఈసీ తీసుకొచ్చిన ఈ-వాచ్ యాప్ కు హైకోర్టు బ్రేకులు వేయడం తదితర అంశాలపై వైసీపీ ఎంపీలు సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న వైసీపీ ఎంపీలు శుక్రవారం మీడియాతో మాట్లాడారు..

అసలేం జరిగిదంటే..
పంచాయితీ ఎన్నికలు సజావుగా నిర్వహిస్తానన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఫిర్యాదుల స్వీకరణ, ఎన్నికలకు సంబంధించిన ఇతర సమాచార మార్పిడి కోసం 'ఈ-వాచ్' పేరుతో ఒక మొబైల్ అప్లికేషన్ ను ఆవిష్కరించారు. అయితే, ప్రభుత్వ శాఖల దగ్గరున్న డేటాను, అవి రూపొందించిన యాప్ లను, కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించిన యాప్ లను కాదని, నిమ్మగడ్డ సొంతగా యాప్ తయారుచేయడాన్ని వైసీపీ తొలి నుంచీ తప్పుపడుతోంది. ఈ-వాచ్ యాప్ వినియోగంపై పలు పిటిషన్లు దాఖలు కాగా, వాటిని శుక్రవారం విచారించిన హైకోర్టు.. ఈనెల 9 వరకు యాప్ వినియోగాన్ని నిలిపేయాలని ఆదేశాలిచ్చింది. ఈ అంశంలో నిమ్మగడ్డ తీరును గర్హిస్తూ వైసీపీ ఎంపీలు సంచలన ఆరోపణలు చేశారు.

టీడీపీ ఆఫీసులోనే తయారైంది..
యాప్ వివాదానికి సంబంధించి వైసీపీ ఎంపీ బాలశౌరి అనూహ్య కామెంట్లు చేశారు. ''రాజ్యాంగ పదవిలో కొనసాగుతోన్న నిమ్మగడ్డ.. ఫక్తు రాజ్యాంగ వ్యతిరేక శక్తిలా వ్యవహరిస్తున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కాదని, తానే సొంతగా ప్రైవేటు యాప్ను తీసుకొచ్చాడు. కానీ ఆ యాప్ ను వాడొద్దంటూ హైకోర్టు ఇవాళ మొట్టికాయలు వేసింది. అసలా యాప్ ఎక్కడ తయారు చేశారు? ఎవరితో చేయించారు? ప్రభుత్వాన్ని కాదని సొంతగా ఎందుకిలా చేస్తున్నారు? అనే ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాలి. మాకున్న సమాచారం ప్రకారం.. టీడీపీ ఆఫీసులోనే నిమ్మగడ్డ ప్రైవేటు యాప్ తయారైంది. అందుకే దాని సెక్యూరిటీ కోడ్ ను కోర్టుకు చెప్పడానికి ఎస్ఈసీ నిరాకరించింది. నిజంగా ఈ-వాచ్ యాప్ ను తయారు చేసింది ఎస్ఈసీనే అయిఉంటే, కోర్టుకు కోడ్స్ చెప్పడానికి భయమెందుకు? ఐదు రోజుల సమయం అవసరం ఏముంది? సరిగ్గా ఇలాగే..

అడ్డంగా దొరికిన నిమ్మగడ్డ..
ఇవాళ్టి యాప్ ఉదంతం లాగే గతేడాది లేఖ వివాదంలోనూ నిమ్మగడ్డ అడ్డంగా దొరికిపోయారు. ఏపీలో తనకు భద్రత లేదని, ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందంటూ నిమ్మగడ్డ సంతకంతో కేంద్రానికి పంపిన లేఖ టీడీపీ ఆఫీసులోనే తయారైంది. ఆ లేఖ తయారు చేసిన కంప్యూటర్లు, సంబంధిత హార్డ్ డిస్కులు, ఇతర ఆధారాలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసినట్లు సీఐడీ విచారణలో తేలింది. ప్రస్తుతం యాప్ విషయంలోనూ అదే జరుగుతోందని మా అనుమానం. దీనిపై వివరణ ఇవ్వాల్సింది ఎస్ఈసీనే. అసలు..

పార్క్లో కాక్ టెయిల్ మోషన్..
తనకు వ్యతిరేకంగా కోర్టుల్లో ఎలాంటి ఆదేశాలు వచ్చినా నిమ్మగడ్డ వెంటనే బ్రేక్ ఫాస్ట్ మోషన్, లంచ్ మోషన్, హౌజ్ మోషన్ అంటూ హడావిడి చేస్తాడు. హైదరాబాద్ లో సాయంత్రాల్లోనేమో పార్క్ హయాత్ హోటల్లో పచ్చ చొక్కాలతో కలిసి కాక్ టెయిల్ మోషన్స్ మూవ్ చేస్తాడు. గతంలో అలాంటి మూమెంట్లు చేసి అడ్డంగా దొరికిపోయాడు కూడా. నిజంగా ఇలాంటి వ్యక్తికి ఎస్ఈసీగా కొనసాగే అర్హత ఉందా? నిబంధనలు, కోర్టు తీర్పులు వేరుగా ఉండొచ్చుగాక, అయితే, నైతికంగా ఆయన ఆ పదవికి అర్హుడేనా? అని ఆత్మావలోకనం చేసుకోవాలి. రాష్ట్రపతి నుంచి రాజ్యసభ సభ్యుల వరకు చాలా ఎన్నికలు ఏకగ్రీవంగానే జరుగుతాయి. అలాంటిది సర్పంచ్ పదవులకు మాత్రం ఏకగ్రీవాలు వద్దని నిమ్మగడ్డ చెప్పడం సమంజసమేనా? అది కూడా తాను పుట్టిన గుంటూరు జిల్లాలో, తనకు ఉద్యోగమిచ్చిన వ్యక్తి(చంద్రబాబు) జిల్లా చిత్తూరులోనే ఏకగ్రీవాలు వద్దనడమేంటి?'' అని ఎంపీ బాలశౌరి అన్నారు. ఇక..

ఐటీ శాఖ కోర్టులో బంతి..
ప్రభుత్వ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా ఎస్ఈసీ నిమ్మగడ్డ తీసుకొచ్చిన 'ఈ-వాచ్' యాప్ను ఈనెల 9వ తేదీ వరకు ఆపరేట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. కాగా, సొంత యాప్ లను రూపొందించుకునే అధికారం ఎస్ఈసీకి ఉందని, ఆ మేరకు భారత ఎన్నికల సంఘం గతంలోనే అనుమతులు ఇచ్చిందని నిమ్మగడ్డ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణ సందర్భంగా.. ఈ-వాచ్ యాప్కు సెక్యూరిటీ డేటా సర్టిఫికెట్ కోసం గురువారమే దరఖాస్తు చేశారని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ పేర్కొంది. అనుమతుల పరిశీలనకు 5 రోజుల సమయం పడుతుందని ఏపీటీఎస్ పేర్కొంది. ఈలోపు యాప్ను పరిశీలించాలని ఏపీటీఎస్కు ధర్మాసనం సూచించింది. మేకపాటి గౌతంరెడ్డి మంత్రిగా ఉన్న ఏపీ ఐటీ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఏపీటీఎస్.. నిమ్మగడ్డ యాప్ పై ఎలాంటి రిపోర్టు ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. యాప్ తయారీ వెనుక టీడీపీ హస్తం ఉందని వైసీపీ ఎంపీలు ఆరోపిస్తున్న క్రమంలో దానికి ఏపీటీఎస్ అనుమతి లభిస్తుందా? లేదా? ఇంకేవైనా ఆసక్తికర విషయాలు బయటికొస్తాయా? అనేది ఉత్కంఠ రేపుతున్నది. ఇదిలా ఉంటే..

నిమ్మగడ్డకు పోటీగా వైసీపీ ‘నేత్రం’
స్థానిక ఎన్నికల విషయంలో ఎస్ఈసీతో నువ్వా-నేనా అన్నట్లుగా వ్యవహరిస్తోన్న వైసీపీ.. పంచాయతీ ఎన్నికల ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్ను ఆవిష్కరించింది. ఈ- నేత్రం పేరుతో రూపొందించిన ఈ యాప్ ను వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా క్షేత్రస్థాయిలో ఎక్కడి నుంచైనా, ఎవరైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, ఫొటోలు, వీడియోలు సైతం అప్లోడ్ చేసే సౌలభ్యంతో యాప్ను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఎస్ఈసీ రూపొందించిన ఈ - వాచ్ యాప్ పై అనుమానాలున్నాయని, దాని నిర్వాహణ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండటంతో తాము ఈ-నేత్రం యాప్ను అందుబాటులోకి తెచ్చామని అప్పిరెడ్డి చెప్పారు. ఈ యాప్ కు వచ్చే ఫిర్యాదులను ఎస్ఈసీకే పంపుతామన్నారు.












Click it and Unblock the Notifications