అవసరమైతే రీపోల్ పై నిర్ణయం : బ్యాలెట్ పేపర్లు దెబ్బ తిన్నాయి-ఎస్ఈసీతోనూ : జి.కె.ద్వివేది..!!
ఏపీలో జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అనేక చోట్ల బ్యాలెట్ బాక్స్ లు ఓపెన్ చేయగానే కొన్నింట వర్షం నీరు.. మరి కొన్ని ప్రాంతాల్లో చెదలు పట్టిన బ్యాలెట్ పేపర్లు కనిపించాయి. దీని పైన కౌంటింగ్ సిబ్బంది జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి జీకే ద్వివేదీ ఈ రకమైన ఫిర్యాదుల పైన ఆరా తీసారు. ఎక్కెడక్కడ ఇటువంటి సమస్యలు వచ్చాయనే అంశం పైన వివరాలు సేకరించారు. పలు జిల్లాల్లో ఇటువంటి సమస్యలు రావటంతో ఆయన స్పందించారు.
లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని ద్వివేది చెప్పారు. 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాల్లో కౌంటింగ్ ఎక్కడా ఆగలేదని..కొనసాగుతోందని స్పష్టం చేసారు. పలు కారణాలతో 6 చోట్ల బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయని వివరించారు. రెండుచోట్ల బ్యాలెట్ పేపర్లకు చెదలు, మిగిలిన4 చోట్ల తడిచాయని అధికారికంగా వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడికొండ మం. రావెల, బేజాతపురంలో బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో షలాంత్రిలో బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయని చెప్పారు.
విశాఖలో తూటిపల్ల, పాపయ్యపాలెంలో బ్యాలెట్లు తడిచాయన్నారు. బ్యాలెట్ పేపర్ల వాలిడేషన్పై కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులదే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసారు. రీపోల్ అవసరమనుకుంటే ఎస్ఈసీ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు త్వరగా వస్తాయని..జడ్పీటీసీ ఫలితాలు సాయంత్రం, రాత్రి వరకు సమయం తీసుకొనే అవకాశం ఉందని వివిరించారు. అయితే, బ్యాలెట్ బాక్సుల్లో సమస్యలు గుర్తించిన ప్రాంతాల్లో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధులు జిల్లా అధికారులను కలుస్తున్నారు.
అయితే, అక్కడక్కడా బ్యాలెట్ పేపర్లు దెబ్బ తిన్నాయని.. దీని కారణంగా ఫలితాల పైన ప్రభావం ఉంటుందా లేదా అనే అంశం పైన అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని జిల్లాల అధికారులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఫలితం ఇద్దరి అభ్యర్ధుల మధ్య సమానంగా..లేదా దగ్గరగా ఉన్న సమయంలో దెబ్బ తిన్న బ్యాలెట్ పేపర్ల సంఖ్య ను సైతం అప్పుడు రీ పోలింగ్ అనివార్యమైతేనే నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కౌంటింగ్ ఫలితాలు ఇప్పుడిప్పుడే వేగం అందుకుంటున్నాయి. సాయంత్రానికి ఈ మొత్తం వ్యవహారం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.