టీ ఎంత ముఖ్యమో ఏపీ అంతే, 9నెలలుగా ఎదురు చూస్తున్నారు: సోనియా
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంత ముఖ్యమో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కూడా అంతే ముఖ్యమని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం లోకసభలో అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఏఫీ పునర్విభజన బిల్లు పైన చర్చ సాగింది. ఈ సందర్భంగా సోనియా మాట్లాడారు.
విభజన చట్టంలోని అంశాలను ఎన్డీయే సర్కారు విస్మరిస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టును ఇప్పటికే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించామని, ఈ నేపథ్యంలో పోలవరం పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు.
ఏపీకి ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో హామీ ఇచ్చారన్నారు. దీనిని ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీయే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తొమ్మిది నెలలుగా ఏపీ ప్రజలు హామీల అమలు కోసం ఎదురు చూస్తున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంత ముఖ్యమో.. ఏపీ హామీలు నెరవేర్చడం, ఆ రాష్ట్ర ప్రయోజనాలు అంతే ముఖ్యమన్నారు. ఏపీ సత్వర అభివృద్ధికి ప్రధాని మోడీ చొరవ తీసుకోవాలన్నారు. కడప జిల్లాకు స్టీల్ ఫ్యాక్టరీ, దుగరాజుపట్నం పోర్ట్, ఏపీకి రైల్వే జోన్, విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వెంటనే చేపట్టాలన్నారు. యూపీఏ ఇచ్చిన హామీల అమలులో ఎన్డీయే ప్రభుత్వం శ్రద్ధ చూపించడం లేదన్నారు. ప్రధాని తక్షణం ఏపీ హామీలపై దృష్టి సారించాలన్నారు.