వైఎస్ భారతి పీఏ వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్-ఎట్టకేలకు తెలంగాణలో చిక్కిన వైనం..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కూటమి పార్టీల అధినేతలు, వారి కుటుంబాలపై అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి పీఏ, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త కూడా అయిన వర్రా రవీందర్ రెడ్డి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. తెలంగాణలోని మహబూబ్ నగర్ లో ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా వర్రాను పట్టుకున్న కడప పోలీసులు అనూహ్య రీతిలో వదిలేసి చిక్కుల్లో పడ్డారు.
సోషల్ మీడియాలో కూటమి సర్కార్ పై అనుచిత పోస్టులు పెడుతున్న వర్రా రవీందర్ రెడ్డిని తాజాగా ఓ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కడప పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చారు. అక్కడ 41 ఏ నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని కోరారు. ఆ తర్వాత మరో కేసు గురించి మాట్లాడేలోపే అక్కడి నుంచి వర్రా తప్పించుకున్నాడు. రవీందర్ రెడ్డి అరెస్టు విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన ఎస్పీ హర్ష వర్ధన్ రాజు తో పాటు డీఎస్పీ, సీఐపై ప్రభుత్వం ఇప్పటికే వేటు వేసింది.

ఆ తర్వాత వర్రాను పట్టుకునేందుకు నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో వర్రా రవీందర్ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ఆయన్ను కడపకు తీసుకొచ్చి స్థానిక కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే వర్రాపై నమోదైన కేసుల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దీంతో వర్రాపై నమోదైన కేసుల్లో ఆయన్ను రిమాండ్ కు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications