విశాఖలో 2 లక్షల కిలోల గంజాయి తగలబెట్టిన పోలీసులు-రాష్ట్రంలో ఇదో రికార్డు
విశాఖ ఏజెన్సీలో పోలీసులు ఇవాళ భారీ ఎత్తున గంజాయిని దహనం చేశారు. విశాఖ మన్యం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు అక్రమంగా రవాణా అవుతున్న క్రమంలో స్వాధీనం చేసుకున్న గంజాయిని ఇవాళ పోలీసులు దహనం చేశారు. మొత్తం రెండు లక్షల కేజీల గంజాయిని దహనం చేసినట్లు పోలీసులు ప్రకటించారు.
విశాఖ ఏజెన్సీలో రెండు లక్షల కిలోల గంజాయిని పలు కుప్పలుగా పోసి పోలీసులు ఇవాళ తగులబెట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ నేరుగా పాల్గొని గంజాయి దహనం ప్రారంభించారు. ఆ తర్వాత మిగతా పోలీసు అధికారులు కూడా వివిధ కుప్పల్ని తగులబెట్టారు. ఈ గంజాయి అంతా గతంలో పలు సందర్భాల్లో అక్రమంగా రవాణా చేస్తున్న వారి నుంచి స్వాధీనం చేసుకున్నదే. దీన్ని ఇలా తగులబెట్టడం ఆనవాయితీగా వస్తోంది. విశాఖ మన్యం నుంచి భారీ ఎత్తున అక్రమంగా గంజాయి అవుతున్నా చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు రికార్డు స్ధాయిలో గంజాయి స్టాక్ ను తగులబెట్టడం విశేషం.
ఏడాది క్రితం విశాఖ మన్యం నుంచి గంజాయి అక్రమ రవాణాపై తీవ్ర విమర్శలు రావడంతో సీఎం జగన్ నేరుగా జోక్యం చేసుకుని పోలీసులకు తగు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు నిఘాతో పాటు స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేయడంలో పోలీసులు సఫలమయ్యారు. ఈ క్రమంలో ఎక్కడి కక్కడ చెక్ పోస్టులు ఎర్పాటు చేసి గంజాయి స్మగ్లింగ్ ను అడ్డుకున్నారు. దీంతో విశాఖ మన్యం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు అక్రమ గంజాయి రవాణా చాలా మేర తగ్గింది. అదే సమయంలో విశాఖ మన్యంలో యువకులు, విద్యార్ధులకు గంజాయిపై అవగాహన కల్పించడం ద్వారా అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో గంజాయి దహనం కార్యక్రమాన్ని పోలీసు శాఖ ఇవాళ ప్రతిష్టాత్మకంగా నిర్పహించింది.