లాక్ డౌన్ లెక్కేలేదు...విచ్చలవిడిగా సరిహద్దులు దాటి పోలీసులపైనే దాడులు..ఏపీ బోర్డర్స్ లో ఉద్రిక్తత
కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి వారం రోజులు కావస్తున్నా ప్రజలు మాత్రం నిబంధనలు ఉల్లంఘించి ఇళ్లకు చేరుకునేందుకు సరిహద్దులు దాటేస్తున్నారు. అడ్డొచ్చిన పోలీసులపై దాడులు చేసే వరకూ పరిస్ధితి వెళుతోంది. ఇళ్లలో నుంచి కదలకూడదని లాక్ డౌన్ నిబంధనలు చెబుతున్నా.. వినకుండా సరిహద్దులకు చేరుకోవడమే కాకుండా సొంత రాష్ట్రంలో తమను ఎందుకు రానివ్వరంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. నిన్న ఏకంగా గుంటూరు జిల్లా సరిహద్దుల్లో పోలీసులపై దాడులకు దిగడంతో ఇకపై మరింత కఠినంగా వ్యవహరించాలని డీజీపీ ఆదేశాలు ఇచ్చారు.

లాక్ డౌన్ గాలికి... మేం ఇంటికి..
ప్రధాని మోడీ ప్రకటనకు అనుగుణంగా వచ్చే నెల 14వ తేదీ వరకూ తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమల్లో ఉంది. ఈ సమయంలో ఇళ్లను దాటి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదు. గుంపులు గుంపులుగా ప్రయాణాలు చేసేందుకు అసలు అనుమతి లేదు. కానీ తెలంగాణ పోలీసులు మొన్న చేసిన పిచ్చిపని వేలాది మందిని ఏపీలోని జగ్గయ్యపేట వద్ద ఉన్న గరికపాడు చెక్ పోస్ట్ వద్ద నిలిచిపోయేలా చేసింది. అయితే వెంటనే ఇరు ప్రభుత్వాలు మాట్లాడుకుని తెలంగాణ పోలీసులకు చీవాట్లు పెట్టడంతో వెంటనే ఎన్వోసీలు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి జనాన్ని వెనక్కి రప్పించారు. మరికొందరు మాత్రం ఏపీ ప్రభుత్వం చెప్పినట్లుగా క్వారంటైన్ కు వెళ్లేందుకు అంగీకరించారు.

గరికపాడు ఘటనతో ఇంకా విచ్చలవిడిగా..
లాక్ డౌన్ నిబంధనలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉంటాయి. అయినా చదువుకున్న వారు కూడా లాక్ డౌన్ నిబంధనలు ఉన్నా పట్టించుకోకుండా మొన్న తెలంగాణ పోలీసులు ఇచ్చిన ఎన్.వో.సీలను తీసుకుని గరికపాడుకు వచ్చేశారు. గరికపాడు చెక్ పోస్ట్ వద్ద వేల సంఖ్యలో చేరుకోవడమే కాక
పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరికి వారిలో కొందరిని వెనక్కి, మరికొందరిని క్వారంటైన్ కు పంపినా.. ఈ ఘటన
మాత్రం ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రా వాసులకు ఓ అవకాశంగా మారిపోయింది. ఏదో రకంగా సరిహద్దులకు చేరుకుంటే సొంత రాష్ట్ర పోలీసులు తమను లోపలికి పంపిస్తారన్న ఆశతో నిన్న ఒక్కరోజే ఎన్వోసీలు కూడా లేకుుండానే వేల సంఖ్యలో ఏపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. దారిలో ఇతర రాష్ట్రాల్లోని జిల్లాల సరిహద్దులు కూడా యథేచ్ఛగా ఉల్లంఘించి, తప్పించుకుని బోర్డర్లకు చేరుకున్నారు.

పొందుగులలో ఏకంగా పోలీసులపై రాళ్ల దాడి..
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఇతర రాష్ట్రాల నుంచి ఏపీ సరిహద్దులకు చేరుకోవడమే ఓ నేరమైతే.. అక్కడి నుంచి లోపలికి అనుమతించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగడం, వినకపోయేసరికి రాళ్ల దాడులకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా పొందుగుల వద్ద చోటుచేసుకుంది.. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేసి వారిని తరిమి కొట్టాల్సి వచ్చింది. చివరికి వారు తెలంగాణలో స్వస్ధలాలకు వెళ్లగలిగారా అంటే అదీ లేదు. మధ్యలోనే వాడపల్లి వద్ద ఉండిపోవాల్సిన పరిస్దితి. దీంతో వీరి పరిస్ధితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిపోయింది.

డీజీపీ సీరియస్.. ఇక మరింత కఠినం..
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి గుంటూరు జిల్లా పొందుగుల చెక్ పోస్టు వద్దకు రావడమే కాకుండా పోలీసులపై దాడులకు పాల్పడటాన్ని తీవ్ర నేరంగా ఏపీ ప్రభుత్వం పరిగణిస్తోంది. దీంతో దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా, ఇకపై సరిహద్దులు దాటడానికి వచ్చేవారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో ఇక సరిహద్దులు దాటడం కాదు కదా.. స్వస్ధలాల నుంచి కదిలితే చర్యలు తీసుకునేలా ఇతర రాష్ట్రాల పోలీసులతో ఏపీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications