ఏసీలు - గీజర్ల వాడకం తగ్గించండి : పెరుగుతున్న డిమాండ్ - విద్యుత్ సంస్థల ఆంక్షలు..!!
ఏపీలో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోయింది. వేసవి కావటంతో విద్యుత్ వినియోగం భారీగా పెరగటంతో ఒక్క సారిగా విద్యుత్ కొరత మొదలైంది. కొద్ది రోజులుగా పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించారు. విద్యుత్ వినియోగం పైన కొన్ని ఆంక్షలు అమలు చేస్తున్నారు. అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. దీని పైన రాజకీయంగానూ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. విద్యుత్ నిర్వహణ లో మిగులు ఉండే పరిస్థితి నుంచి కొరతకు ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం నుంచి దీనికి స్పందనగా..గత ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందాల గురించి నిలదీస్తున్నారు. ఇదే సమయంలో విద్యుత్ సంస్థలు మాత్రం ప్రస్తుత డిమాండ్ ను తట్టుకోవాలంటే కొన్ని ఆంక్షలు తప్పదని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా గృహ వినియోగదారులపైనా ఆంక్షల అమలు దిశగా సూచనలు చేస్తున్నాయి. ఏసీల వాడకం తగ్గించాలని, నీటి మోటార్లను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే వాడాలని పంపిణీ సంస్థలు సూచించాయి. ఐఎస్ఐ మార్కు ఉన్న మోటార్లు, పంపులు వినియోగించాలని తెలిపాయి.
అవసరమైతేనే లైట్లు ఉపయోగించాలని.. బయటకు వెళ్తే లైట్లను ఆఫ్ చేయాలని పేర్కొన్నాయి. వస్త్ర దుకాణాలు, సూపర్ మార్కెట్లలో 50 శాతం లైట్లను మాత్రమే ఉపయోగించాలని విద్యుత్ సంస్థలు ఆంక్షలు విధించాయి. గృహాల్లో ఏసీలు, గీజర్లు వాడొద్దని సూచించాయి. అవసరమైనప్పుడే లైట్లు వేయాలని, పొదుపు చర్యలు పాటించాలని కోరాయి. వ్యవసాయానికి కూడా పగటి పూట నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏపీతో పాటుగా దేశంలోని మరో 12 రాష్ట్రాల పైన విద్యుత్ కొరత ఎదుర్కొంటున్నాయి.
పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, బీహార్, యూపీ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో పరిశ్రమలకు వారంలో 2-3 రోజులు పవర్ హాలిడే ప్రకటించడంతో పాటు ఇళ్లకు గంటల తరబడి కోతలు విధిస్తున్నారు. అయితే, ఏపీలో ఈ నెలాఖరు తరువాత పరిస్థితిలో మార్పు కనిపిస్తుందని...ఈ సమస్య తాత్కాలికమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఏపీలో జగనన్న కాలనీల్లో నిర్మించిన ఇళ్లకు డిస్కంల ద్వారా ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.