పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్ ఆదేశాలపై కోర్టుకు- ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని హెచ్చరికలు
పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని, సహకరించిన అధికారులపై చర్యలు తప్పవని పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన పిలుపు ఏపీలో కలకలం రేపుతోంది. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన ఎస్ఈసీ పెద్దిరెడ్డిని పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకూ హౌస్ అరెస్టు చేయాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు. దీంతో మరో రచ్చ మొదలైంది.
మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలను ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్రెడ్డి తప్పుబట్టారు. నిమ్మగడ్డ రమేష్ వివాదాస్పదంగా మారి లేనిపోని అప్రతిష్ట మూటగట్టుకుంటున్నాని ఆయన తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డిని నిలువరించాలనుకోవడం అప్రజాస్వామికం, దురదృష్టకరమని కాకాణి అన్నారు. నిమ్మగడ్డ రమేష్ తన పరిధి దాటి చర్యలు తీసుకుంటున్నారని కాకాణి పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల ఎన్నికల కమిషన్ అభాసుపాలవుతుందన్నారు.
ఎన్నికల కోసం యాప్ ప్రవేశపెట్టిన నిమ్మగడ్డను ఇప్పటికే కోర్టు తప్పుపట్టిందని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి అన్నారు. పెద్దిరెడ్డిపై జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోకపోతే న్యాయపోరాటానికి వెళ్తామని కాకాణి హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో శాంతి, సామరస్యంగా జరిగే ఏకగ్రీవాలను నిలిపేయాలని నిమ్మగడ్డ ఉత్తర్వులు ఇవ్వడం మంచి పద్ధతి కాదన్నారు. మరోవైపు ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డిపై గవర్నర్కు ఇచ్చిన ఫిర్యాదులో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో నిమ్మగడ్డపై ప్రివిలేజ్ కమిటీ విచారణ కొనసాగుతుండగానే ఆయన ఇచ్చిన ఆదేశాలు వైసీపీకి మంటపుట్టిస్తున్నాయి.