ఏపీకి మూడురోజులపాటు వర్ష హెచ్చరిక చేసిన వరుణుడు!
ఎల్ నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలలోను సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు వాతావరణంలో మార్పులు కనిపించబోతున్నాయి. వాతావరణ శాఖ పలు జిల్లాలకు వర్షాల హెచ్చరికలు జారీ చేసింది.
నేటి నుండి మూడురోజులు ఈ జిల్లాలలో వర్షాలు
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో నిలకడగా కొనసాగుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆకాశం మేఘావృతమై, చల్లని వాతావరణం ఉంటుంది. నేటినుండి ఎల్లుండి వరకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణాజిల్లా, ఏలూరు వైయస్సార్ కడప జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

రాయలసీమ జిల్లాలలోనూ వర్షాలు
ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే కొన్ని ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని పేర్కొందిఇక రాయలసీమ జిల్లాలలోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణం చల్లబడుతుంది అని తెలిపింది.
వర్షాల విషయంలో ప్రజలకు అలెర్ట్
దక్షిణ కోస్తా ప్రాంతంలో పొడి వాతావరణం తో పాటు చల్లని ఉపరితల గాలులు బలంగా వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.అయితే వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్ల కింద నిలబడడం మంచిది కాదని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. వర్షం పడే సమయంలో పొలాలలో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలలో ఉండాలని సూచించింది.
లోటు వానలు, నీటివినియోగంపై జాగ్రత్త
ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో సెల్ ఫోన్ ఆన్ చేయవద్దని సూచించింది. నైరుతి రుతుపవనాల ప్రభావం ప్రస్తుతం కొనసాగుతున్న క్రమంలో రాష్ట్రంలో అనేకచోట్ల వర్షాలు పడుతున్నప్పటికీ, ఈసారి లోటు వర్షపాతం నమోదవుతున్న క్రమంలో నీటి వినియోగం విషయంలో, నీటి నిల్వలను చేసే విషయంలో ప్రజల బాధ్యత ఉందని ప్రభుత్వం పేర్కొంది.













Click it and Unblock the Notifications