ఏపీని 'వదల బొమ్మాళీ' అంటున్న బంగాళాఖాతం!
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుసల అల్ప పీడనాలతో ఏపీలో జోరుగా వానలు కురుస్తున్నాయి. దాదాపు రెండు వారాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. మంగళవారం కూడా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఏలూరు, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఎన్టీఆర్ జిల్లా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడనున్నాయి.
అత్యవసర సాయం కోసం బృందాలు
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వానలకు ధవళేశ్వరం వద్ద గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. దీనివల్ల అక్కడ గోదావరి ఉగ్రంగా ప్రవహిస్తోంది. బ్యారేజ్లో 12.05 లక్షల క్యూసెక్కుల నీరు ఉన్నట్లు విపత్తుల సంస్థ వెల్లడించింది. ఇప్పటికే అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీచేయబోతున్నారు. అత్యవసరంగా సహాయం చేసేందుకు నాలుగు ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. అలాగే మరో నాలుగు ఎస్డీఆర్ ఎఫ్ బలగాలను కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది.

53కు చేరితే మూడో హెచ్చరిక
వరదలవల్ల ప్రభావితమయ్యే జిల్లాలతోపాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయడానికి కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వర్షాలు, వరదలను దృష్టిలో ఉంచుకొని టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. అత్యవసర సాయం కోసం 18004250101, 1070,112 నెంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా వరద నీరు 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీచేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications