గోదావరి హెచ్చరిక; ముంపు గుప్పిట్లో ఏపీ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏజెన్సీలో వాగులు వంకలు, పొంగిపొర్లుతున్నాయి. గత వారం రోజులుగా ఏపీలో అనేక జిల్లాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వందలాది గ్రామాలు ఇళ్లకే పరిమితం అవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు గిరిజన ప్రాంతాలలో బాహ్య ప్రపంచం తో సంబంధాలు తెగిపోయాయి.
ముంపులో ఏజెన్సీ గ్రామాలు
ఏఓబి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ముంచుకొస్తున్న కారణంగా అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్లలో రాత్రి వేళల్లో రాకపోకలను నిషేధించారు. ముఖ్యంగా పాడేరు, జి మాడుగుల, ముంచంగిపట్టు, కొయ్యూరు, డుంబ్రిగూడ మండలాల పరిధిలో వాగులు, వంకలు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి.

గోదావరికి వరద ఉధృతి
మరోవైపు గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. దీంతో ధవలేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 14.9 అడుగులకు చేరుకుంది. అధికారులు సముద్రంలోకి 14.56 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి వరదతో కోనసీమ లంక గ్రామాలు నీట మునిగాయి.
ముంపు ప్రాంతాల్లో స్కూళ్ళకు సెలవు
కొత్తపేట, మండపేట, పి గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గంలోని సుమారు 1000 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. కాజ్ వేలు మునిగిపోవడంతో లంక వాసులు పడవల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాలలో నేడు విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.
సహాయక చర్యల్లో 11 బృందాలు
కొవ్వూరు గోష్పాద క్షేత్రం లోకి వరద నీరు చేరుకుంది. సీతానగరం మండలంలో ఏటిగట్టు ఉధృతంగా ప్రవహిస్తోంది. తాజా పరిస్థితులతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద ఉధృతి పెరుగుతుందని, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యల్లో నాలుగు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు, 7 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నట్టుగా వెల్లడించారు. పూర్తిస్థాయి వరద తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.












Click it and Unblock the Notifications