కర్నూల్ కోటపై కన్నేసిన టీడీపీ.. : పాగా వేస్తుందా..? వైసీపీ బ్రేక్ వేస్తుందా..?
కర్నూల్ : ఏపీలో ప్రతిపక్షాన్ని చావుదెబ్బ కొడుతూ వస్తోన్న అధికార టీడీపీ తాజాగా కర్నూల్ కార్పోరేషన్ ఎన్నికలపై ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. కర్నూల్ కార్పోరేషన్ కి నవంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో.. గెలుపు కోసం ఇప్పటినుంచే ప్రణాళికలు రచించే పనిలో పడ్డట్టు సమాచారం.
టీడీపీ అధికారంలోకి వచ్చాక జరగబోతున్న ఎన్నికలు కావడంతో రెండేళ్ల తర్వాత పార్టీ సత్తా తగ్గిందా..? పెరిగిందా..? అన్నది బేరీజు వేసుకోవడానికి ఈ ఎన్నికలే కీలకం కానున్నాయి. ఇకపోతే ప్రతిపక్షం వైసీపీ కూడా టీడీపీ దూకుడుకు బ్రేక్ వేయడానికి ఈ ఎన్నికలను ఓ అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తోంది. కాగా, గత కర్నూల్ కార్పోరేషన్ రాజకీయాల్లో కాంగ్రెస్ ముందు టీడీపీ తేలిపోయింది. దీంతో గత రాజకీయాలు టీడీపీకి ఏమాత్రం అనుకూలంగా లేని పరిస్థితి.
కర్నూల్ కార్పోరేషన్ పరిధిలో మొత్తం 3.2 లక్షల ఓటర్లు, 51 వార్డులు ఉండగా, గత ఎన్నికలను పరిశీలిస్తే.. 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ఫిరోజ్ బేగం మేయర్ గా పనిచేశారు. ఆ తర్వాత 2005 లోను వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ కర్నూల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది కేవలం మూడు వార్డుల్లో మాత్రమే.

ఇక ఆ తర్వాత 2010 నుంచి కర్నూల్ కార్పోరేషన్ పర్యవేక్షణ ప్రత్యేకాధికారుల చేతుల్లోనే ఉంటూ తరచూ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. తాజాగా నవంబర్ లో కార్పోరేషన్ ఎన్నికలు జరగడం ఖాయమన్న ఊహాగానాలు వినిపిస్తుండడంతో ఈ దఫా ఎలాగైనా సత్తా చాటాలనే యోచనలో ఉంది టీడీపీ.
అధికారంలో ఉండడాన్ని కార్పోరేషన్ ఎన్నికలకు అనుకూలంగా మార్చుకోవడం కోసం .. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కర్నూల్ జిల్లా ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, అలాగే మంత్రి కేఈ ప్రభాకర్, టీజీ వెంకటేష్ వంటి నేతలందరినీ ఈ ఎన్నికల కోసం రంగంలోకి దించాలనే టీడీపీ ఉన్నట్టు సమాచారం.
ఎన్నికలకు సంబంధించి ఆర్థిక వ్యవహారాలను కూడా పార్టీయే చూసుకుంటుందన్న భరోసా కూడా అధిష్టానం నుంచి వ్యక్తమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇకపోతే కర్నూల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీకి కళ్లెం వేయడం ద్వారా తిరిగి పార్టీని ఫామ్ లోకి తీసుకురావాలని వైసీపీ భావిస్తోంది. దీంతో రెండు పార్టీల నడుమ హోరాహోరీ పోరు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
కర్నూల్ ఓటర్లను పార్టీ వైపుకు తిప్పుకునేందకు ఎంపీ బుట్టా రేణుకతో పాటు, జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరిత ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారన్న చర్చ జరుగుతోంది. దీంతో రాబోయే కర్నూల్ కార్పోరేషన్ ఎన్నికలు ఇప్పటి నుంచే చర్చనీయాంశంగా మారగా.. కర్నూల్ కోటలో పాగా వేసేదెవరో తేలాలంటే ఎన్నికలు వరకు వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications