చెన్నంపల్లికోటలో...గుప్తనిధుల కోసం తవ్వితే...విలువైన ఖనిజాలు దొరికాయి...
Recommended Video
గుప్తనిధుల కోసం వెళితే విలువైన ఖనిజ సంపద దొరికింది. చెన్నంపల్లికోట తవ్వకాల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామమిది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం ఎపి ప్రభుత్వం తవ్వకాలు జరిపిస్తున్నసంగతి తెలిసిందే.
చెన్నంపల్లి కోటలో అపార నిధినిక్షేపాలు ఉన్నాయన్న స్థానికుల ప్రచారం నమ్మి తవ్వకాలకు పూనుకొన్నఎపి ప్రభుత్వానికి ఊహించని పరిణామం ఎదురైంది. ఈ కోటలో ఇప్పటివరకు గుప్తనిధుల కోసం జరిపిన తవ్వకాల్లో ఏనుగు దంతాలు, మూడు తలల నాగుపడక, కొన్ని జంతువుల కళేబరాల అవశేషాలు మాత్రమే బయటపడ్డాయి. దీంతో డీలాపడిన అధికారవర్గాలు పట్టువిడవకుండా మళ్లీ తవ్వకాలను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో కోటలో అతి విలువైన ఖనిజ సంపద రెడ్ చిప్ గ్రానైట్, క్వార్ట్జ్ వంటి మినరల్స్ ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
శ్రీ కృష్ణదేవరాయుల కాలం నాటి చెన్నంపల్లి కోటలో బంగారం, వజ్రాల నిక్షేపాలున్నట్లు స్థానికుల నమ్మకం. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్ళడంతో ఇటీవల తవ్వకాలకు ఎపి ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో మైనింగ్, రెవెన్యూ, గ్రామ అభివ అద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున దాదాపు 20 రోజులపాటు తవ్వకాలు జరిగాయి. ఈ తవ్వకాల్లో ఏనుగు దంతాలు, మూడు తలల నాగుపడగ, కొన్ని జంతు కళేబరాల అవశేషాలు లభించాయి.
అయితే గుప్త నిధుల జాడలేదు. అయితే రెండో విడతగా మరోసారి తవ్వకాలను ప్రారంభించిన అధికారులు విలువైన ఖనిజ సంపదను గుర్తించారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన కర్నూలు ఆర్డీవో ఓబులేసు ఖనిజాల వివరాలు తెలిపారు. చెన్నంపల్లికోటలో మినరల్స్ లో విలువైన రెడ్ చిప్ గ్రానైట్, క్వార్ట్జ్ వంటి ఖనిజ సంపదను గుర్తించినట్లు ఆయన చెప్పారు. అయితే స్థానికులు మాత్రం ఈ కోటలో బంగారం, వజ్రాల నిక్షేపాలతో కూడిన గుప్త నిధులు ఉన్నాయనే ఇప్పటికి బలంగా విశ్వసిస్తుండటం గమనార్హం.