ఏపీ పరిషత్ పోరు మళ్లీ మొదటికి- రేపు పార్టీలతో నీలం భేటీ- తర్వాతే నిర్ణయం
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చినట్లే కనిపిస్తోంది. పరిషత్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఎంతగా తొందరపడుతున్నా విపక్షాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలు, కోర్టు కేసుల నేపథ్యంలో ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నీ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. దీంతో ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రాజకీయ పార్టీలతో మాట్లాడి పరిషత్ పోరుపై నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పరిషత్ పోరుపై ఎస్ఈసీ తకరారు
ఏపీలో మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలో గతేడాది ప్రారంభమై వాయిదా పడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తిరిగి నిర్పహించే విషయంలో ఆయనకు పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఓవైపు కోర్టు కేసులు, మరోవైపు విపక్ష పార్టీల అభ్యంతరాలతో దీనిపై ఏ నిర్ణయం తీసుకోకుండానే ఆయన పదవీ విరమణ చేసి వెళ్లిపోయారు. అయినా చివరి నిమిషం వరకూ ఆయన ఎన్నికలు నిర్వహించేలా ఒత్తిడి చేసిన వైసీపీ సర్కారు.. ఇఫ్పుడు కొత్త ఎస్ఈసీ నీలం హయాంలో ఈ పోరు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయినా ఆమె కూడా దీనిపై దూకుడుగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్ధితి.
పరిషత్ పోరు మళ్లీ మొదటికొచ్చిందా ?
ఇవాళ కొత్త ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిషత్ ఎన్నికలు సంబంధించి అధికారులతో బిజీబిజీగా సమీక్షలు నిర్వహించిన నీలం సాహ్నీ.. తుది నిర్ణయం మాత్రం తీసుకోలేకపోయారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించినా కోర్టు కేసులు, విపక్షాల అభ్యంతరాలతో ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో చివరికి రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుని, కోర్టుల్లో అభ్యంతరాలు లేకుండా చూసుకుని ఎన్నికలకు వెళ్తే మంచిదని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పరిషత్ పోరు నిర్వహణ అంత సులువు కాదని ప్రభుత్వానికీ అర్ధమవుతోంది.
రేపు రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రధానంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విపక్ష పార్టీలతో సమావేశం కావాలని ఎస్ఈసీ నీలం సాహ్నీ నిర్ణయించారు. అందుకే రేపు ఉధయం 11 గంటలకు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసారు. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో జరిగే ఈ భేటీకి హాజరై పరిషత్ ఎన్నికల నిర్వహణపై తమ అభిప్రాయాలు చెప్పాలని రాజకీయ పార్టీలకు ఎస్ఈసీ అధికారులు సమాచారం పంపనున్నారు.
కొత్త నోటిఫికేషన్కు విపక్షాల డిమాండ్ ఇందుకేనా ?
ఏపీలో గతేడాది వాయిదా పడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తిరిగి నిర్వహించాల్సి వస్తే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇదే డిమాండ్ను మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ ముందు విపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన , కమ్యూనిస్టులు వినిపించాయి. ఇవాళ కొత్త ఎస్ఈసీ నీలం సాహ్నీని కలిసిన టీడీపీ నేత వర్ల రామయ్య కూడా మరోసారి ఇదే డిమాండ్ చేశారు. దీంతో ఎస్ఈసీ ప్రభుత్వం కోరుకున్న విధంగా పాత నోటిఫికేషన్తోనే ముందుకెళ్తే విపక్షాలు హైకోర్టును ఆశ్రయించబోతున్నాయి. గతంలో జారీ అయిన నోటిఫికేషన్ ప్రకారం ప్రారంభమైన ప్రక్రియలో ప్రభుత్వం బలవంతపు ఏకగ్రీవాలు చేయించిందని ఆరోపిస్తున్న విపక్షాలు.. ఇప్పుడు అదే నోటిఫికేషన్ కొనసాగిస్తే తమకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నాయి. దీంతో ఎస్ఈసీ తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారిపోయింది.