ఏపీలో 4 దశల్లో స్థానిక ఎన్నికలు- షెడ్యూల్ ఇలా-ఎస్ఈసీ కీలక ప్రకటన..!
ఏపీలో వచ్చే ఏడాదితో స్థానిక సంస్థల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఉన్న అవకాశాలు, ఎస్ఈసీ సంసిద్ధత, ఈవీఎంల వాడకం వంటి అంశాలపై కమిషనర్ నీలం సాహ్నీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటిపై ఇవాళ ఆమె ప్రకటన విడుదల చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్ని నాలుగు దశల్లో నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వమే ఈవీఎంలను కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు.గ్రామ పంచాయతీలలో 1,37,671 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని ఆమె తెలిపారు. ఎన్నికల కోసం 41,301 కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతాయన్నారు. ఒక కంట్రోల్ యూనిట్కు రెండు బ్యాలెట్ యూనిట్లు అనుసంధానం చేయవచ్చన్నారు.

సంవత్సరం క్రితమే ఈవీఎంల వినియోగంపై ప్రభుత్వం ఒక కమిటీ వేసిందని నీలం సాహ్నీ తెలిపారు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ కమిటీకి ఛైర్మన్గా ఉన్నారని గుర్తుచేశారు. జనవరి నుంచి ఎన్నికలపై ఒక ఆలోచనకు రావాలని సూచనాత్మకంగా లేఖ రాసినట్లు తెలిపారు. ఇవాళ ఈవీఎంల గురించి మాత్రమే చర్చించామన్నారు.ఆన్లైన్ నామినేషన్లు ఇచ్చినా, ఫిజికల్గా ఇవ్వాల్సిందేనని ఎస్ఈసీ తెలిపారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయించాలన్నారు. జనవరి నుంచి స్థానిక ఎన్నికల సంసిద్ధత తెలియజేయాలని కోరినట్లు ఎలక్షన్ కమీషనర్ నీలం సాహ్ని తెలిపారు.

ఎస్ఈసీ ప్రతిపాదన ప్రకారం అక్టోబర్ 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ప్రచురించాలి. నవంబర్ 1 నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి. నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తి చేయాలి. డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి అదే నెలలో ఫలితాలు ప్రకటించాలి.












Click it and Unblock the Notifications