రూ.40 వేల ఇంటి అద్దె కోసం అధికారుల పట్టు: తిరస్కరించిన ఏపీ ఆర్ధికశాఖ
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నుంచే పాలన కొనసాగించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని ఏర్పాట్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వెలగపూడిలో నిర్మిస్తోన్న తాత్కాలిక సచివాలయ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఉద్యోగులు సైతం హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వచ్చారు.
హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చిన ఉద్యోగులకు సంబంధించి అన్ని వసతులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. ఉద్యోగులు తరలి వచ్చినప్పటికీ, శాఖల ముఖ్య అధికారులు మాత్రం ఇంకా తరలిరాక పోవడం ప్రభుత్వానికి కాస్తంత ఇబ్బందిగా మారింది.
అంతేకాదు అధికారులకు ఇచ్చే ఇళ్ల అద్దె పరిమితిపై అనిశ్చితి కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు తమకు రూ. 40 వేలు ఇంటి అద్దెగా ఇవ్వాలని అధికారులు చాలా మంది అడుగుతున్నారని తెలుస్తోంది. అయితే ఈ 'అద్దె' ప్రతిపాదనను ఆర్థిక శాఖ తిరస్కరించింది.
అధికారుల ఇంటి అద్దె విషయమై వచ్చిన ఫైలును తిరిగి సీఎస్ కార్యాలయానికి పంపింది. అంతేకాదు ఒక్కో అధికారికి అద్దె కింద రూ.40 వేలు ఇవ్వడం తమకు తలకు మించిన భారమవుతుందని ఆర్ధిక శాఖ అందులో స్పష్టం చేసింది. అంతేకాదు ఈ విషయం తేల్చడానికి ఒక కమిటీ వేయాలని సూచించింది.
హైదరాబాద్లో అధికారులకు ఇస్తున్న విధంగానే నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోనూ 30శాతం హెచ్ఆర్ఏనే కొనసాగించే యోచనలో ఉన్నామని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో మాదిరిగా హైదరాబాద్లోనూ, అమరావతిలోనూ రెండు చోట్లా హెచఆర్ఏ అమలుచేయాలన్న ప్రతిపాదనను తోసిపుచ్చారు.
హైదరాబాద్ నుంచి ఏపీకి తరలుతున్న ఉద్యోగులకు 30 శాతం హెచ్ఆర్ఏ ఇస్తున్నాం కాబట్టి, అధికారులకూ అదే వర్తింపజేయాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. అయితే, నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోనూ, చుట్టుపక్కలా అద్దెలు ఎక్కువగా ఉన్నాయని, తమకు రూ.40 వేలు అద్దె కోసం ఇవ్వాలని పలువురు అధికారులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారని సమాచారం.
అయితే ఈ డిమాండ్ను ఆర్ధిక శాఖ తోసిపుచ్చింది. ఉద్యోగులు కూడా ఆ ప్రాంతాలకే తరలుతున్నారని, వారికి 30 శాతం హెచఆర్ఏ అమలు చేస్తున్నామని, అక్కడికే వెళ్తున్న అధికారులకు మాత్రం రూ.40 వేలు అద్దె ఇస్తే ఉద్యోగుల పరిస్థితేంటని ఆర్థిక శాఖ ప్రశ్నించినట్లు సమాచారం. ఈ మేరకు తన అభిప్రాయాలను ఆ ఫైలుపై రాసి, ఈ సమస్యపై కమిటీ వేయాలని సూచిస్తూ సీఎస్ కార్యాలయానికి తిప్పి పంపింది.