వెలగపూడిలో హైటెక్ సచివాలయం: నాలుగు లారీల్లో వెలగపూడికి పైళ్లు
అమరావతి: ఏపీ సచివాలయంలో కొత్త సంస్కరణలకు తెరదీశారు. సచివాలయ నిబంధనల్లో మార్పులు తీసుకు వచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో భేటీ జరిగింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సచివాలయ నిబంధనలను మార్చాలని అధికారులకు మంత్రి సూచించారు.
సచివాలయంలో పైళ్లు ఆలస్యం అవుతుండటంతో టెక్నాలజీని వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సచివాలయ అధికారులతో మంత్రి యనమల భేటీ అయ్యారు. ప్రతి ఉద్యోగి వద్దకు పైలు వెళ్లడం వల్ల అనుకున్న సమయానికి పైలు పూర్తి అవడం లేదని, అంతేకాకుండా సిక్రసీ కూడా పోతుందన్నారు.

వెలగపూడిలో హైటెక్ సచివాలయం
దీంతో ప్రస్తుత సచివాలయ నిబంధనలను హైటెక్ సచివాలయంగా మార్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఉన్న ఈ ఆఫీసు, ఈ ఫైలు వ్యవస్థను మరింత పటిష్టంగా చేయాలని నిర్ణయించారు. ఈ పైలింగ్ వల్ల ఆర్ధిక శాఖలో ఒక్క పైలు కూడా పెండింగ్లో లేదని, ఇదే పద్ధతిని అన్ని శాఖల్లో అమలు చేయాలని ఆదేశించారు.

డాష్ బోర్డులో చూసుకునేలా వెసులుబాటు
ఏ పైలు ఎక్కడ ఉందో, ఎక్కడ పెండింగ్లో ఉందనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు డాష్ బోర్డులో చూసుకునేలా వెసులుబాటు కల్పించాలని అధికారులకు సూచించారు. అయితే పైళ్ల విషయంలో అధికారులు ప్రమేయం ఉంటుంది కాబట్టి, అధికారులతో పూర్తి స్థాయిలో చర్చించి, త్వరలో చంద్రబాబుతో సమీక్షించిన నిర్ణయం తీసుకుంటామన్నారు.

పని విభజనను తగ్గించుకుని, టెక్నాలజీని వాడుదాం
సచివాలయంలో పని విభజనను తగ్గించుకుని దానికి అనుకూలంగా మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. ఇదిలా ఉంటే వచ్చే నెల మూడో తేదీ నుంచి తాత్కాలిక సచివాలయం నుంచి పరిపాలన సాగించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి మంగళవారం నాలుగు లారీల్లో ఆర్థికశాఖకు చెందిన ఫైళ్లు, కంఫ్యూటర్లు వెలగపూడికి తరలించారు.

నాలుగు లారీల్లో హైదరాబాద్ టు వెలగపూడి
హైదరాబాద్ నుంచి ఫైళ్లు, ఫర్నిచర్ తరలింపు ప్రక్రియ మంగళవారం అన్ని శాఖల్లో పూర్తిస్థాయిలో ప్రారంభమైంది. అమరావతికి తీసుకువెళ్లాల్సిన ఫైళ్లను స్కాన్ చేస్తూ ఉద్యోగులు బిజీ బిజీగా కనిపించారు. మున్సిపల్, హౌసింగ్, ఫైనాన్స్, ప్లానింగ్ శాఖలు ఇప్పటికే కొన్ని ఫైళ్లను స్కానింగ్ చేయగా, మిగిలి ఉన్నవాటిని ప్యాక్ చేసి తరలించడానికి సిద్ధం చేశారు.

30వ తేదీనాటికి తరలింపు ప్రక్రియ పూర్తి
ఈ నెల 30వ తేదీనాటికి అన్ని శాఖలు ఫైళ్లను, ఫర్నిచర్ను వెలగపూడికి తరలించే పనిలో ఉన్నాయి. సచివాలయ ఉద్యోగులకు అవసరమైన ఏర్పాట్లన్నీ వెలగపూడిలో పూర్తవుతున్నాయి. ప్రతి శాఖ కార్యాలయంలో కొత్త ఫర్నీచర్, కొత్త కంప్యూటర్లు, క్యూబికల్స్, ఇతర వసతులను పద్ధతి ప్రకారం అమరుస్తున్నారు.

ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలగపూడి
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ఆహ్లాదకరమైన పని వాతావరణాన్ని సృష్టించారు. బయటి గోడల స్థానంలో సెయింట్ గోబిన్ గ్లాస్లు వాడారు. దీంతో మంచి వెలుతురు లోపలికి వస్తోంది. లోపలంతా సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేశారు. కంప్యూటర్లు కొత్తవి అమరుస్తున్నారు. ప్రతి భవనంలో అత్యాధునిక ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.

స్మోక్ డిటెక్టివ్ యంత్రాలు
పొగ కనిపిస్తే కనిపెట్టే స్మోక్ డిటెక్టివ్ యంత్రాలను అమర్చారు. అన్ని భవనాల్లో ప్రతి అంతస్తులో రెండు నీటిశుద్ధి యంత్రాలు, వాటికి అనుసంధానంగా మంచినీటి కూలర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక...విద్యుత పొదుపునకూ ప్రాధాన్యం ఇచ్చారు. కారిడార్లో రాకపోకలను బట్టి అవసరమైన మేరకే లైట్లు వెలుగుతాయి, ఆరిపోతాయి.

రెండు భవనాల్లో ఇంటర్నెట్ సౌకర్యం పూర్తి
రెండు భవనాల్లో ఇంటర్నెట్ సౌకర్యం పూర్తిస్థాయిలో కల్పించారు. మిగిలిన భవనాల్లోనూ ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కార్యాలయానికి సంబంధించిన భవనాన్ని కూడా దసరాకల్లా పూర్తిచేయానున్నారు. మంగళవారం ఆర్థిక, ప్రణాళికా శాఖలకు సంబంధించి 400ల మంది కూర్చోవడానికి అవసరమైన క్యూబికల్స్, కుర్చీలు, కొత్త కంప్యూటర్లు అమర్చారు.












Click it and Unblock the Notifications