విశాఖలో ఊహించని మలుపులు.. కాపులుప్పాడ కొండపై కొత్త సచివాలయం.. వైఎస్ భారతి పరిశీలన..
మూడు రాజధానుల ఏర్పాటుపై పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ ఎండాకాలంలోపే సచివాలయాన్ని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించాలని డిసైడయ్యారు. అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించి ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటిదాకా మధురవాడలోని మిలీనియం టవర్స్ లో సెక్రటేరియట్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొనగా.. సడెన్ గా ఇప్పుడు 'కాపులుప్పాడ కొండ' తెరపైకి వచ్చింది. కొండపై 1350 ఎకరాల సువిశాల స్థలంలో కొత్త సచివాలయం నిర్మాణానికి పనులు మొదలైనట్లు తెలుస్తోంది.
కొండ నిండా ఆఫీసులే..
ఎగ్జిక్యూటివ్ క్యాపిటిల్ గా విశాఖ ఉంటుందన్న ప్రకటన వెలువడినప్పటి నుంచి సెక్రటేరియట్ ఎక్కడ ఏర్పాటుచేస్తారనే అంశంపై తీవ్ర చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అమరావతి నుంచి సెక్రటేరియట్ ను వీలైనంత తొందరగా విశాఖకు తరలించాలనుకున్న ప్రభుత్వం.. తొలుత మధురవాడలోని మిలీనియం టవర్స్ ను ఎంపిక చేసింది. కానీ ఐటీ కంపెనీల నుంచి వ్యతిరేకత రావడం, ప్రతిపక్ష పార్టీలు సైతం విమర్శలకు దిగడంతో ప్రభుత్వం ‘కాపులుప్పాడ కొండ'పై ఫోకస్ పెట్టింది. మిలీనియం టవర్స్ కు దగ్గరగా ఉండే ఈ కొండపైనే సెక్రటేరియట్ తోపాటు ఇతర ముఖ్యమైన ఆఫీసులన్నింటినీ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
అదానీ వెనుకడుగుతో..
నిజానికి కాపులుప్పాడ కొండపైనున్న స్థలాన్ని గత టీడీపీ ప్రభుత్వం.. ఐటీ సంస్థల కోసం కేటాయించింది. ఆమేరకు లే అవుట్ కూడా రూపొందించింది. అక్కడ డేటా పార్క్ చేస్తానని ప్రఖ్యాత పారిశ్రామికవేత్త గౌతం అదానీ ముందుకురావడంతో చంద్రబాబు ఎగిరిగంతేశారు. అయితే, డేటా పార్కు కోసం తొలుత రూ. 70 వేల కోట్లు వెచ్చిస్తామన్న అదానీ కంపెనీ.. తీరా రూ. 3 వేల కోట్ల పెట్టుబడే పెడతామని వెనుకడుగు వేయడంతో ప్రభుత్వం కూడా నిర్ణయాన్ని మార్చుకుంది. అదానీకి కాపులుప్పాడ కొండపై కాకుండా మరోచోట స్థలం కేటాయించాలని నిర్ణయిచింది. లే అవుట్లు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఇప్పుడదే చోట సెక్రటేరియట్ నిర్మాణానికి సీఎం జగన్ పచ్చజెండా ఊపినట్లు తెలిసింది.
మొత్తం 1350 ఎకరాలు..
కాపులుప్పాడ కొండ మొత్తాన్ని ప్రభుత్వ భవనాల కోసమే వాడుకోవాలని సీఎం జగన్ సూచించినట్లు వెల్లడైంది. ప్రస్తుతం అక్కడ 1350 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. ఇప్పటికే 250 ఎకరాల్లో లే అవుట్ తో 175 ఎకరాలు వాడుకునేదుకు సిద్ధమైంది. ఇంకో 600 ఎకరాల్లోనూ కొండను తొలిచి, చదును చేసి, భూమిని వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఇదిలాఉంటే..
Recommended Video
విశాఖకు సీఎం సతీమణి
ఎగ్జిక్యూటివ్ రాజధానిలో కొత్త సెక్రటేరియట్ తోపాటే సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్ సతీమణి వైఎస్ భారతి విశాఖ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అదుబాటులో ఉన్న బిల్డింగ్స్ ను పరిశీలించేందుకు ఇటీవలే ఆమె విశాఖకు వచ్చారని వైసీపీ వర్గాలు పేర్కొన్నాయి. భీమిలిలోని ఓషన్ వ్యూ గెస్ట్ హౌస్, విశాఖ సిటీలోని నేవీ గెస్ట్ హౌస్ తోపాటు రుషికొండలోని ఇంకొన్ని సముదాయాలనూ ఆమె పరిశీలించినట్లు తెలిసింది. కాపులుప్పాడ కొండపై సచివాలయ నిర్మాణానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సిఉంది.