గుంటూరు జిల్లా విద్యార్ధినికి జీఎస్ఎల్వీ అవార్డు
హైదరాబాద్: నెల్లూరులోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లో ఆదివారం నుంచి అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా జీఎస్ఎల్వీ అవార్డు ఇచ్చేందుకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని 46 మంది విద్యార్ధులనుఆహ్వానించారు.
వీరంతా గత మార్చిలో జరిగిన పదోతరగతి పరీక్షల్లో జిల్లా టాపర్లు. వీరికి షార్లో వివిధ పోటీ పరీక్షలు నిర్వహించారు. ప్రధమ బహుమతి గుంటూరు జిల్లాకు చెందిన జె. వెంకటలహరి, ద్వితీయ బహుమతి కె. శరణ్ సిద్దార్ద్ (నిజామబాద్), తృతీయ బహుమతి ఇ. లలిత (తూర్పుగోదావరి), నాల్గవ అవార్డు జె. కృష్ణ కిశోర్ (మెదక్) సాధించారు.
వీరికి ఈ అవార్డులను షార్ డైరెక్టర్ ఎంవైఎశ్ ప్రసాద్ సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో జీఎస్ఎల్వీ అవార్డులు బహుకరించారు.
పరీక్ష ఫీజు చెల్లించేందుకు తుది గడువు నవంబర్ 5
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించిన తేదీలను ప్రభుత్వం విడుదల చేసింది. పరీక్ష ఫీజు చెల్లించేందుకు తుది గడువు నవంబర్ 5గా ప్రకటించింది. రూ. 50 రుసుముతో నవంబర్ 20 వరకూ చెల్లించవచ్చునని విద్యాశాఖ ప్రకటించింది.
రూ. 200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2 వరకు చెల్లించవచ్చునని తెలిపింది. రూ. 500 రుసుముతో డిసెంబర్ 10 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
దొంగనోట్లు చలామణి చేస్తున్న ఇద్దరి అరెస్టు
దొంగనోట్లు చలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం బోడిరెడ్డిపల్లి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల నకిలీ నోట్లను, ద్రావకం, రూ. 10 వేలు డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.