AP SSC EXAM RESULTS 2022 : పదో తరగతి ఫలితాల విడుదల వాయిదా-ఎప్పుడో తెలుసా ?
ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో హడావిడిగా ఈ ప్రకటనను వాయిదా వేశారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభ్యర్ధులకు నిరాశ తప్పలేదు.
కొన్ని అనివార్య కారణాల వల్ల శనివారం (4-6-2022)ఉదయం 11 గంటలకు విడుదల చేయాల్సిన పదవ తరగతి ఫలితాలు విడుదల చేసే కార్యక్రమాన్ని సోమవారానికి వాయిదా వేసినట్లు విద్యాశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మీడియా ప్రతినిధులు, తల్లిదండ్రులు దీన్ని గమనించాలని డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ డి. దేవానంద్ రెడ్డి ప్రకటించారు. దీంతో విద్యార్ధులు ఫలితాల కోసం సోమవారం వరకూ ఎదురుచూడాల్సిన పరిస్దితి.

వాస్తవానికి రెండేళ్లుగా కరోనా కారణంగా పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో విద్యార్ధులను పాస్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. ఎట్టకేలకు మూడో ఏడాది పరీక్షలు నిర్వహించారు. ఇందులోనూ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం కలకలం రేపింది. ప్రభుత్వం దీన్ని మాస్ కాపీయింగ్ గా ఓసారి, ప్రశ్నాపత్రాల లీక్ గా మరోసారి పేర్కొని గందరగోళం రేపింది.
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అవేవీ జరగలేదని ఓసారి ప్రకటించారు. చివరికి ప్రభుత్వం ప్రశ్నాపత్రాల లీక్ కు కారణమంటూ నారాయణ విద్యాసంస్ధల మాజీ ఛైర్మన్ నారాయణను అరెస్టు కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఫలితాలపై విద్యార్ధుల్లో ఉత్కంఠ కూడా పెరిగింది.












Click it and Unblock the Notifications