ఏపీ కేబినెట్ హైలెట్స్: ప్రత్యేకహోదాపై చర్చ, రిషికేశ్వరి కుటుంబానికి 10 లక్షలు
అమరావతి: విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు మొదలైన ఏపీ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా 8 గంటల పాటు సాగింది. సమావేశం ముగిసిన అనంతరం కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడించారు.
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రోజుతో బాలసుబ్రహ్మణ్య కమిటీ విచారణ ముగిసింది. విద్యార్థి మృతి పైన ప్రభుత్వం వర్సిటీ ఉన్నతాధికారులు, రెవెన్యూ, పోలీసు అధికారులతో సమన్వయ కమిటీని నియమించింది.
సీనియర్ల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి తల్లిదండ్రులు శుక్రవారం విజయవాడలోని క్యాంప్ ఆఫీస్లో సీఎం చంద్రబాబును కలిశారు. తమ కూతురు ఆత్మహత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు చంద్రబాబును కోరారు.
ఏపీ కేబినెట్ హైలెట్స్:
* ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయనున్న ట్రిపుల్ ఐటీకి దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని నిర్ణయించారు.
* అబ్దుల్ కలాం పేరిట విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించారు.
* రాష్ట్రంలో రెండు లక్షల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 2.5 లక్షల వ్యయం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ. 5,500 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది.
* రాజీవ్ స్వగృహలో 2894 ఇళ్లు కట్టాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 822 ఇళ్లు పూర్తవగా, మిగిలినవి పూర్తి చేయాలని నిర్ణయించారు.
* రిషికేశ్వరి ఆత్మహత్య పైన చర్చ జరిగింది. రిషికేశ్వరి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే, రాజమండ్రిలో 500 చదరపు గజాల భూమిని ఇవ్వాలని నిర్ణయించారు.
* ఏపీలోని యూనివర్సిటీల్లో కుల సంఘాలను రద్దు చేస్తున్నట్టు తెలిపారు.
* రిషికేశ్వరి ఆత్మహత్యపై యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళణలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
* యూనివర్సిటీల పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
* త్వరలో యూనివర్సిటీలో బోధకులను నియమిస్తామని తెలిపారు.
* నాగార్జునా యూనివర్సిటీకి కొత్త వీసీగా ప్రొఫెసర్ సింహాద్రిని నియమిస్తూ నిర్ణయం.
* ప్రత్యేక హోదాపై కేంద్రం చేసిన ప్రకటనపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.
* కేంద్రం చేసిన ప్రకటన దేశంలోని ఇతర రాష్ట్రాలకు వర్తిస్తుందని, కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కాదని సర్దిచెప్పుకున్నట్లు తెలుస్తోంది.
* మంత్రులంతా ఏపీ నూతన రాజధాని ప్రాంతంలో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.