ఆ రెండు జిల్లాల్లో పిడుగులు...అక్కడేమో సముద్రం అల్లకల్లోలం:వాతావరణ శాఖ హెచ్చరికలు
అమరావతి: తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, కడియం, రాజానగరం, పశ్చిమ గోదావరి జిల్లాలోని చాగల్లు, నిడదవోలు, పెరవలి, ఆచంట, పోడూరు, పెనుమంట్ర, పెనుగొండ మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.మరోవైపు విశాఖలో పలుచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకురావడంపై ప్రజలు అప్రమప్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
క్యుములోనింబస్ మేఘాల వల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది. ఇక రాజమండ్రిలో గురువారం మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది.
కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఏదో ఒక చోట పిడుగులు పడుతుండటం, ఇలా రాష్ట్రవ్యాప్తంగా వేలాది పిడుగుల పడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ పిడుగుల బారిన పడి ఎప్పుడూ లేని విధంగా భారీ సంఖ్యలో జనాలు మృత్యువాతన పడుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమప్తంగా వ్యవహరించాలని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ శాఖ హెచ్చరిక హెచ్చరిస్తోంది.
ఇదిలావుండగా మరోవైపు విశాఖపట్టణంలో సాగర్నగర్, రుషికొండ తదితర తీర ప్రాంతాలలో సముద్రం బుధవారం నుంచి అల్లకల్లోలంగా మారింది. ఒకపక్క రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తుండటం, సముద్రంలో డిప్రషన్ ఏర్పడడంతో పాటు పౌర్ణమి రోజులు కావడంతో సముద్రంలో అలల ఉధృతి బాగా తీవ్రంగా ఉంది. రెండు రోజులుగా కెరటాలు ధాటి ఎక్కువగా ఉండగా...బుధ,గురు వారాల్లో వాటి తీవ్రత మరింత పెరిగింది. కెరటాలు ఇసుకతెన్నులు దాటి ముందుకు చొచ్చుకురావడంతో సముద్రపు నీటితో సాగర్నగర్ తీరం తటాకాన్ని తలపిస్తోంది.
అయితే సముద్రం ఇలా ముందుకు చొచ్చుకురావడంపై బీచ్కు వచ్చే సందర్శకులు భయానికి గురవుతున్నారు. ఎందుకైనా మంచిదని అలల చెంతకు పోకుండా దూరం నుంచే చూస్తూ కొంత సమయం గడిపి వెనుదిరుగుతున్నారు. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు పొగలాంటి ఆవిరి తీర ప్రాంతాల పైకి చొచ్చుకువస్తోంది. దీంతో ప్రస్తుతం తీర ప్రాంతాలలో అన్నింటా అదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.