ఇవాళ గవర్నర్ తో ఎన్నికల కమిషనర్ భేటీ- ఆ తర్వాతే కేంద్రానికి నివేదిక ?
ఏపీలో స్ధానిక ఎన్నికల వాయిదా వ్యవహారం కాకరేపుతోంది. ఎన్నికల వాయిదాకు కారణం కరోనా వైరస్ ప్రభావమే అంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ప్రకటన, ఆ తర్వాత చేసిన అధికారుల బదిలీలు వివాదాస్పదమైన నేపథ్యంలో తర్వాత ఏం జరగబోతోందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇలాంటి తరుణంలో ఎన్నికల వాయిదాకు దారి తీసిన కారణాలు, సీఎం జగన్ వ్యాఖ్యలపై గవర్నర్ హరిచందన్ కు ఓ నివేదిక ఇచ్చేందుకు ఇవాళ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్ భవన్ వెళ్లబోతున్నారు.
ఎన్నికల వాయిదా ఎందుకంటే..
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల వాయిదా నిర్ణయం పూర్తిగా ఎన్నికల కమిషనర్ చేతుల్లోనే ఉన్నప్పటికీ అది తీసుకున్న విధానం సరికాదన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. ఓవైపు కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. అదే సమయంలో అధికారుల బదిలీలు చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. దీనిపై ఇప్పటికే సీఎం జగన్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ హరిచందన్ కు ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత ఎన్నికల కమిషనర్ వ్యవహారశైలిపై నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్.. ఇవాళ గవర్నర్ ను కలిసి ఎన్నికల వాయిదాకు దారి తీసిన కారణాలతో పాటు ఇతర అంశాలను వివరించనున్నారు.
ఈసీ నిర్ణయమే ఫైనల్..
గవర్నర్ హరిచందన్ తో భేటీ సందర్భంగా పలు రాజ్యాంగ పరమైన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సిద్దమవుతున్నారు. ఇందులో ప్రధానంగా స్ధానిక ఎన్నికల వాయిదా వేసేందుకు తనకు సర్వాధికారాలు ఉన్నాయని, ఇందులో ఎవరి ప్రమేయం అవసరం లేదనేది ప్రధానమైనది. ఆ తర్వాత ఎన్నికల కమిషనర్ కంటే ప్రజలు మెజారిటీ ఇచ్చిన తనకే ఎక్కువ అధికారాలున్నాయనే అర్ధం వచ్చేలా సీఎం జగన్ నిన్న చేసిన వ్యాఖ్యలపైనా నిమ్మగడ్డ .. గవర్నర్ కు వివరణ ఇవ్వబోతున్నారు. అలాగే అధికారుల బదిలీల వ్యవహారంపైనా ఆయన ఎన్నికల నిర్వహణ ప్రక్రియను గవర్నర్ ముందుంచబోతున్నారు. ఇందులో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈసీకే సర్వాధికారాలు ఉంటాయని, ఇందులో భాగంగానే అధికారులను బదిలీ చేసినట్లు ఆయన చెప్పబోతున్నారు.
సీఎం జగన్ విమర్శలపై ...
స్ధానిక ఎన్నికల వాయిదాపై సీఎం జగన్ తన ప్రెస్ మీట్లో ఎన్నికల కమిషనర్ కు కులం పేరుతో దురుద్దేశాలు ఆపాదించారని భావిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఇప్పటికే స్పందించారు. సీఎం వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యవస్ధలను బలహీనం చేసేలా ఉన్నాయని నిన్న ఇచ్చిన వివరణలో ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు అదే విషయాన్ని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. హైకోర్టు జడ్జితో సమానంగా ఎన్నికల కమిషనర్ గా తనకు అధికారాలు ఉన్నాయని, వీటిని వక్రీకరించేలా జగన్ మాట్లాడారనే అంశాన్ని కూడా నిమ్మగడ్డ గవర్నర్ కు ఫిర్యాదు చేయబోతున్నారు.
Recommended Video
ఈసీతో భేటీ అనంతరం కేంద్రానికి నివేదిక..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ నుంచి స్ధానిక ఎన్నికల వాయిదాతో పాటు అన్ని తాజా పరిణామాలపై వివరణ తీసుకున్నాక కేంద్రానికి నివేదిక పంపేందుకు గవర్నర్ హరిచందన్ సిద్దమవుతున్నారు. రాష్ట్రంలో స్ధానిక ఎన్నికల వాయిదా వ్యవహారం కేంద్రం కోర్టులోకి చేరే అవకాశం ఉండటంతో అంతకన్నా ముందే ఇక్కడ ఏం జరిగిందనే విషయాన్ని కేంద్రానికి నివేదించాలనే యోచనలో గవర్నర్ ఉన్నారు. దీంతో ఎన్నికల కమిషనర్ కు ఇవాళ అపాయింట్ మెంట్ ఇచ్చిన గవర్నర్.. భేటీ తర్వాత కేంద్రానికి నివేదిక పంపే అవకాశముంది. వీటి ఆధారంగా కేంద్రం కానీ, కేంద్ర ఎన్నికల సంఘం కానీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశముంది.