టీడీపీకి కరోనా తెచ్చిన కష్టాలు...కేసుల భయంతో ఇళ్లకే పరిమితం.. వైసీపీ ఖుష్..
ఏపీలో టీడీపీని ఇరుకున పెట్టడానికి ఏ అవకాశం వచ్చినా వదులుకునే పరిస్ధితుల్లో అధికార వైసీపీ లేదు. తాజాగా కరోనా వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ ను సైతం వైసీపీ అదే స్ధాయిలో వాడేసుకుంటోంది. లాక్ డౌన్ పేరుతో టీడీపీ నేతలను పోలీసులు ఇళ్లకే పరిమితం చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు మాత్రం రోడ్లపై తిరుగుతూ స్దానిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.
టీడీపీకి లాక్ డౌన్ కష్టం..
ఏపీలో గతేడాది అధికారం కోల్పోవడం కాదు కానీ టీడీపీకి ఎక్కడ లేని కష్టాలు వచ్చి పడ్డాయి. వరుస విచారణల పేరు మీద టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైసీపీ ప్రభుత్వం.. మరోవైపు ఆపరేషన్ ఆకర్ష కు తెరలేపి విపక్ష నేతలకు గాలం వేస్తోంది. ఇదంతా జరుగుతుండగానే కరోనా వైరస్ విపక్ష పార్టీకి అనుకోని కష్టాలను తెచ్చిపెట్టింది. లాక్ డౌన్ నేపథ్యంలో టీడీపీకి ఊపిరాడటం లేదు.
లాక్ డౌన్ పేరుతో ఇళ్లకే పరిమితం..
స్ధానిక ఎన్నికల సమయంలోనే బయటికి వస్తే చాలు వైసీపీ దాడులు చేయడంతో బిక్కుబిక్కుమంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు.. వాయిదా తర్వాత కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అంతలోనే వచ్చిన కరోనా.. వారిని పూర్తిగా ఇళ్ళకు పరిమితం చేసేసింది. అప్పటికీ ధైర్యంగా తెగించి బయటికి వచ్చి నిత్యావసరాల పంపిణీ చేపట్టిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో వీరంతా ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది.
ఇళ్లలోనే టీడీపీ దీక్షలు..
రాజకీయం అంటేనే జనంలో ఉండటం, జనంలో లేకపోతే రాజకీయానికి అర్ధమే లేదు. అదీ స్దానిక ఎన్నికలు పూర్తి కాని నేపథ్యంలో ఇంట్లోనే ఉండిపోతే ఇక ఓటమిని స్వయంగా ఆహ్వాంచినట్లే. ప్రజల్లో తిరగకుండా రేపు వారి దగ్గరికి వెళ్లి ఓట్లు అడిగేదెలా, ఇప్పుడు టీడీపీ నేతలను వేధిస్తున్న సమస్య ఇది. దీంతో అధిష్టానమే వారికి ఓ ఐడియా ఇచ్చింది. ఇళ్లలోనే ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు చేపట్టడం. ఇంకే ముంది టీడీపీ ఎమ్మెల్యేలంతా ఇప్పుడు పేదలకు సాయం డిమాండ్లతో దీక్షలకు దిగుతున్నారు. ఎలాగో ఇంట్లోనే చేసుకునే దీక్షలు కాబట్టి పోలీసులు, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందీ లేదు. ఎటొచ్చీ కార్యకర్తలను రప్పించడం ఒక్కటే కష్టం. అయినా సరే పట్టువదలని విక్రమార్కుల్లా టీడీపీ ఎమ్మెల్యేలు దీక్షలు సాగిస్తున్నారు.
అటు వైసీపీ మాత్రం..
కరోనా వైరస్ లాక్ డౌన్ పేరుతో టీడీపీని ఇళ్లకే పరిమితం చేసేసిన అధికార వైసీపీలో ఇప్పుడు మరింత జోష్ కనిపిస్తోంది. లాక్ డౌన్ ముగియగానే వెంటనే స్ధానిక పోరు నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకున్న వైసీపీ సర్కారు.. ఇప్పుడు ఎమ్మెల్యేలు, నేతలు జనంలో తిరుగుతున్నా, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పట్టించుకోవడం లేదు. దీంతో వీరికి ఫ్రీ హ్యాండ్ లభించినట్లయింది. ప్రత్యర్ధి పార్టీ నేతలు ఇళ్లకే పరిమితం అవుతున్న వేళ.. తాము జనంలో తిరుగుతూ స్దానిక ఎన్నికల ప్రచారం చేసుకోవడం బహుశా వైసీపీకి మినహా మరో రాజకీయ పార్టీకి ఇంత గొప్ప ఆఫర్ ఎప్పుడూ దొరకదన్న వాదన వినిపిస్తోంది.
Recommended Video