లాక్ డౌన్ లో విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే నిరాహారదీక్ష...పేదలకు సాయం కోరుతూ..
ఏపీలో కరోనా వైరస్ కారణంగా లక్షలాది మంది పేదలు, వలస కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిని గట్టెక్కించేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పూర్తి ఫలితం ఉండటం లేదు. దీంతో పేదలకు లాక్ డౌన్ అయ్యేవరకూ నెలకు ఐదు వేల రూపాయల సాయం అందించాలని విపక్ష టీడీపీ డిమాండ్ చేస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇవాళ నిరాహారదీక్ష చేపట్టారు.
పేదలకు సాయం- ఎమ్మెల్యే దీక్ష...
మొన్నామధ్యన ఏపీ ప్రభుత్వం సహకరిస్తే 24 గంటల్లో విజయవాడను శానిటైజ్ చేసి చూపిస్తానని సవాల్ విసిరిన తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. లాక్ డౌన్ కారణంగా ఆకలితో అల్లాడుతున్న పేదలకు ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయల సాయం అందించాలని కోరుతూ ఆయన ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే నిరాహార దీక్ష చేపట్టారు. 12 గంటల నిరాహార దీక్ష చేపట్టిన గద్దె రామ్మోహన్, గద్దె అనురాధ దంపతులకు స్ధానిక ఎంపీ కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత సంఘీభావం ప్రకటించారు.

టీడీపీ ఎమ్మెల్యే డిమాండ్లివే..
లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఒక్కొక్క కుటుంబానికి రూ.5,000 సాయం అందించాలని టీడీపీ హయాంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు, చంద్రన్న భీమా పథకాలను పునరుద్ధరించాలని ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ డిమాండ్ చేస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లతో పాటు చంద్రన్న బీమా పథకాలను గతేడాది అధికారంలోకి రాగనే వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్దానంలో కొత్త పథకాలు తీసుకురాకపోవడంతో పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications