పార్లమెంటులో నిరసనలు: ప్రత్యేక ఆకర్షణగా ప్రిన్స్ మహేష్ మేనల్లుడు, హోదా నినాదాలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఏపీ టీడీపీ ఎంపీలు పార్లమెంటులో తమ ఆందోళనలను మంగళవారం కూడా కొనసాగించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని, ఏపీకి న్యాయం చేయాలంటూ టీడీపీ ఎంపీలు డిమాండ్ చేశారు.
ప్లకార్డులు పట్టుకుని వెల్లోకి వెళ్లారు. విపక్షాల నిరసనల నేపథ్యంలో లోకసభ వాయిదా పడింది. దీంతో పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. పార్లమెంటు ప్రధాన ద్వారా వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు.

వైసీపీ వాయిదా తీర్మానం
కాగా, అంతకుముందు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. సభా కార్యకలాపాలను వాయిదా వేసి ప్రత్యేక హోదాపై సమగ్రంగా సభలో చర్చించాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు.

టీడీపీ, వైసీపీలతోపాటు టీఆర్ఎస్ ఎంపీలు
కాగా, పార్లమెంటు బడ్జెట్ మలి విడత సమావేశాల్లో ఇప్పటివరకు ఒక్కరోజు కూడా సభ సజావుగా సాగలేదు. విభజన హామీలపై టీడీపీ, వైసీపీ, తెలంగాణలో రిజర్వేషన్ల కోటా అంశంపై టీఆర్ఎస్ పార్లమెంటును స్తంభింపజేస్తున్నాయి. దీంతో సభ వాయిదాల పర్వం కొనసాగుతోంది.

ప్రత్యేక ఆకర్షణగా ప్రిన్స్ మేనల్లుడు
ఇది ఇలా ఉండగా, సోమవారం పార్లమెంట్ ఆవరణలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేస్తున్న నిరసనల్లో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు సిద్దార్థ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఉదయం పార్లమెంట్ కు వచ్చిన సిద్దార్థ్.. ప్లకార్డు పట్టుకుని పార్లమెంట్ ముందు నిలబడి నినాదాలు చేస్తుంటే, అటుగా వెళ్లేవారిలో పలువురు ఎవరీ కుర్రాడని ఆరా తీయడం కనిపించింది.

న్యాయం చేయాలంటూ సిద్ధార్థ్
‘విభజన హామీలు అమలు చేయాలి' అని రాసున్న ప్లకార్డును ప్రదర్శించిన సిద్దార్థ్.. రాష్ట్రానికి న్యాయం చేయాల్సిందేనంటూ నినాదాలు చేశారు. ఈ పరిణామంతో ఇప్పటికే గల్లా జయదేవ్ ఎంపీగా కొనసాగుతుండగా, ఆయన కుమారుడు కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో ఉన్నారా? అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది.












Click it and Unblock the Notifications