ఆగస్టు 6 వరకే జగన్ తాత్కాలిక ఆనందం - ఉసురు తప్పదన్న టీడీపీ - పాఠ్యాంశంగా తరలింపంటూ..
మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే.. శ్రావణ శుక్రవారం మంచిరోజనే ఉద్దేశంతో జగన్ సర్కారు గెజిట్ నోటిషికేషన్ ఇచ్చింది. దాంతో కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, జ్యూడీషియల్ క్యాపిటల్ గా కర్నూలు అమలులోకి వచ్చాయ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా భావించిన మూడు రాజధానులపై ముందడుగు పడటంతో వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగారు. కానీ ఇది తాత్కాలిక ఆనందమేనని, ఆగస్టు 6న కథ మలుపు తిరగబోతోందని ప్రతిపక్ష టీడీపీ నేతలు అంటున్నారు.

ఆగస్టు 6 అత్యంత కీలకం..
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయ్యాయి. ఈ వ్యవధిలో.. పంచాయితీ భవనాలకు రంగుల వివాదం, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, సర్కారీ భూముల విక్రయం, ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకం తదితర కీలకమైన వ్యవహారాల్లో జగన్ సర్కారును హైకోర్టు గట్టిగా నిలువరించింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 6న హైకోర్టు ముందుకు రాజధాని అంశం మరోసారి విచారణకు రానుంది. ప్రభుత్వంతోపాటు ప్రతిపక్ష పార్టీలు సైతం దీన్ని అత్యంత కీలకంగా భావిస్తున్నాయి. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని, తరలింపు రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పలు పిటిషన్లను హైకోర్టు గురువారం విచారించనుంది.

వైసీపీ ఆనందం తాత్కాలికమే..
జనం అభిప్రాయాలకు విరుద్ధంగా జగన్ సర్కారు రూపొందించిన పాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లుల్ని గవర్నర్ ఆమోదించటం బాధాకరమని ఏపీ టీడీపీ చీఫ్ కళా వెంకట్రావు అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘బిల్లుల్ని గవర్నర్ ఆమోదించినంత మాత్రాన జగన్ సర్కారు సాధించేది ఏమీ ఉండదు. ఇది వైసీపీకి కేవలం తాత్కాలిక ఆనందం మాత్రమే. ఐదు కోట్ల మంది ఆంధ్రుల తరఫున కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తాం''అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా అమరావతికి జైకొట్టిన జగన్ ఇప్పుడు మోసానికి దిగారని, ఆయనలో నైతిక విలువలు లేవని మరోసారి రుజువైందని కళా విమర్శించారు.

ఆడపడుచుల ఉసురు తప్పదు..
అమరావతినే అభివృద్ధి చేయలేని దద్దమ్మ సీఎం జగన్ అని, అవినీతిపరుల పాలనలో మూడు ప్రాంతాల అభివృద్ధి అసాధ్యమని టీడీపీ శాసనమండలి నేత యనమల రామకృష్ణుడు ఫైరయ్యారు. స్థానికుల ఆస్తులన్నీ దోచి భూకబ్జాదారులకు కట్టబెట్టడమే వైసీపీ పన్నాగమని, సామాజిక బాధ్యతలేని సీఎంగా జగన్ చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు. టీడీపీకే చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. మరో అడుగుముందుకేసి.. శ్రావణ శుక్రవారం రోజున అమరావతి ఆడపడుచులతో జగన్ కన్నీళ్లు పెట్టించారని, వాళ్ల ఉసురు తప్పక తగులుతుందని వ్యాఖ్యానించారు.
Recommended Video

పాఠ్యాంశంగా రాజధాని తరలింపు..
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, ఎన్నికలకు ముందు కూడా వైసీపీ అధినేత జగన్ తాను అమరావతికి అనుకూలమని పదే పదే చెప్పుకున్నారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకున్నారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. జగన్ రాష్ట్రానికి చేసిన ఈ మోసాన్ని చరిత్రలో పాఠ్యాంశంగా ఉండిపోతుందన్నారు. ‘‘ముఖ్యమంత్రి గారూ.. మీ అవగాహనా రాహిత్యంతో రాజధానిని అమరావతి నుంచి వేరొక చొటికి తరలించి చారిత్రాత్మక తప్పిదం చేస్తున్నారు. భావితరాలు మిమ్మల్ని క్షమించవు. మీరు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని రాబోయే రోజుల్లో పాఠ్యాంశంగా విద్యాలయాల్లో బోధిస్తారు. ఆత్మ పరిశీలన చేసుకొని నిర్ణయం వెనక్కు తీసుకోండి. కక్ష్య రాజకీయాలు మంచివి కావు'' అని వర్ల రామయ్య విమర్శించారు.












Click it and Unblock the Notifications