జగన్ ఎఫెక్ట్: అఖిలప్రియ ధర్నా,ఈసీకి టిడిపి ఫిర్యాదు, పీకే వ్యూహంతోనే...
నంద్యాల: నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో వైసీపీ చీఫ్ జగన్ అనుసరిస్తున్న తిట్ల దండకంపై టిడిపి నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. నంద్యాలలోని 9వ, వార్డులో భూమా అఖిలప్రియ జగన్ వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ వ్యాఖ్యలపై టిడిపి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మరో వైపు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వెనుక వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్కిషోర్ వ్యూహం ఉందనే అనుమానాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికల్లో టిడిపి, వైసీపీల మధ్య మాటల యుద్దం సాగుతోంది. వైసీపీ చీఫ్ వారం రోజుల వ్యవధిలో రెండోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో వైసీపీ చీఫ్ జగన్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్ విస్తృతంగా పర్యటించనున్నారు. అయితే ఇంకా రానున్న రోజుల్లో జగన్ ఇంకా ఏ రకమైన ప్రకటనలు చేస్తారోననే ఉత్కంఠ నెలకొంది. అయితే నంద్యాలలో ప్రచారాన్ని పురస్కరించుకొని వైఎస్ జగన్ చేస్తున్న విమర్శలపై టిడిపి నేతలు ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు

జగన్ వ్యాఖ్యలపై అఖిలప్రియ ధర్నా
మూడేళ్ళుగా ఇచ్చిన హమీలను అమలు చేయలని ఏసీ సీఎం చంద్రబాబునాయుడును ఉరితీయాలని గోస్పాడు మండలంలో రోడ్షో సందర్భంగా వైసీపీ చీఫ్ జగన్ తీవ్రమైన వ్యాఖ్యలను చేశారు. ఈ వ్యాఖ్యలపై టిడిపి నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రచారంలో ఉన్న మంత్రి అఖిలప్రియ 9వ, వార్డులో ధర్నా నిర్వహించారు. చంద్రబాబుపై వ్యాఖ్యలు చేసిన వైసీపీ చీఫ్ జగన్పై చర్యలు తీసుకోవాలని ఆమె ధర్నా చేశారు.

ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు
ఏపీ సీఎం చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైసీపీ చీఫ్ జగన్పై టిడిపి నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ నెల 3వ, తేదిన జగన్ ఇదే రీతిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి చంద్రబాబును ఉరితీసిన తప్పు లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఆ రోజే వ్యాఖ్యలపై చర్యలను తీసుకొంటే ,,
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ వ్యాఖ్యలు శృతిమించడంపై మంత్రి దేవినేని ఉమామహేశ్వర్రావు విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నెల3వ, తేదిన జగన్ ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అదే రోజు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకొంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

వివాదాస్పద వ్యాఖ్యల వెనుక
నంద్యాల అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ విమర్శలు సాగుతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వైఎస్ జగన్ వార్తల్లో ఉన్నారు. అయితే ఈ వివాదాస్పద విమర్శల వెనుక ప్రశాంత్కిషోర్ వ్యూహరచన ఉందనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విమర్శ లేదా ప్రశంసైనా అందరి దృష్టి జగన్పై ఉండాలనే ఉద్దేశ్యంతో వివాదాస్పద వ్యాఖ్యలను ఎంచుకొన్నారనే అభిప్రాయాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications