ఏపీ సచివాలయాల ఉద్యోగుల మరో నోటీసు..! మంత్రి రియాక్షన్ ఇదే..!
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు గత కొంతకాలంగా తమ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో వారు నిరసనలకు ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు అధికారులకు ఇప్పటికే నోటీసు కూడా ఇచ్చిన ఉద్యోగ సంఘాలు.. ఇవాళ సంబంధిత మంత్రి డీబీవీ స్వామికి దీనిపై రిమైండర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోందన్న టెన్షన్ నెలకొంది.
ఇవాళ సచివాలయాల శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిని కలిసిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర ఛైర్మన్ ఎం.డి.జాని పాషా, రాష్ట్ర సెక్రటరీ జనరల్ విప్పర్తి.నిఖిల్ కృష్ణ, రాష్ట్ర కన్వీనర్ అబ్దుల్.రజాక్, కో ఛైర్మన్లు బత్తుల.అంకమ్మ రావు,యువ షణ్ముఖ్ తమ సమస్యల్ని వివరించారు. ఉద్యోగుల సమస్యలపై మంత్రితో అరగంట పాటు చర్చించిన అనంతరం ప్రధాన సమస్యలపై పరిష్కారం లభించని పక్షంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని ముందస్తు సమాచారంతో నోటీసు ఇచ్చారు.

సచివాలయ ఉద్యోగులకు వాలంటీర్ల విధుల నుండి విముక్తి కల్పించాలని, మాతృ శాఖలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయాలని ప్రధానంగా వీరు కోరారు. అలాగే నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, ఆరు సంవత్సరాలు ఒకే క్యాడర్ లో పనిచేసిన ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని, జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కల్పించి పే స్కేల్ అమలు చేయాలని కూడా కోరారు. పెన్షన్ నిలుపుదలకు సంబంధించి ఐక్యవేదిక పిలుపు ఇవ్వలేదనే అంశం మంత్రికి స్పష్టంగా తెలియజేశారు.

అనంతరం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘం చెప్పిన విషయాలపై స్పందించిన మంత్రి స్వామి.. వారిని సంయమనం పాటించాలని కోరారు. రాబోయే రోజుల్లో పదోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ప్రయోజనాలు సైతం కల్పిస్తామని తెలిపారు. మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని ఓపికగా ఉండాలని హితవు పలికారు. మరి మంత్రి హామీపై ఉద్యోగులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications