AP weather: ఏపీలో రాబోయే 3 గంటల్లో - ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం (AP Weather) ఒక్కసారిగా మారిపోయింది. ఇవాళ ఉదయం నుంచీ పలు జిల్లాల్లో అకస్మాత్తుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ విభాగం తాజా హెచ్చరికలు జారీ చేసింది. అంతకు ముందు జారీ చేసిన ఆరెంజ్ అలర్ట్ స్ధానంలో ఇప్పుడు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇలా రెడ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో రాబోయే మూడు గంటల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
రాష్ట్రంలోని అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో రాబోయే 3 గంటల్లో తీవ్రమైన ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా పేర్కొంది . ప్రజలు, ముఖ్యంగా రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది. అలాగే గాలివాన సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని ప్రజలకు సూచిస్తోంది.

పిడుగుపాటు, వర్షం తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా, గతంలో జారీ చేసిన ఆరెంజ్ అలర్ట్ను తాజాగా 'రెడ్ అలర్ట్'గా సవరించినట్లు వాతావరణ విభాగం తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎల్ నినో పరిస్ధితుల కారణంగా వర్షాలు కురవక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో కురుస్తున్న వర్షాలు రైతులతో పాటు జనానికీ భారీ ఉపశమనం అందిస్తున్నాయి. ముఖ్యంగా రెండు రోజులుగా తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఇవాళ కురిసిన వర్షంతో వారు కాస్త సేదతీరుతున్నారు.














Click it and Unblock the Notifications