ap weather: అల్పపీడన ప్రభావంతో మరో మూడురోజులపాటు వర్షాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు నిండుకుండలను తలపిస్తుండగా, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాగా, అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో పడమర గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావం వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం కోస్తా బంగ్లాదేశ్, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో తీవ్రంగా మారిందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మిడ్ ట్రోపో స్పియరిక్ లెవెల్స్ వరకు విస్తరించి కొనసాగుతోందని తెలిపింది. రాగల 48 గంటల్లో ఈ తీవ్ర అల్పపీడనం పవ్చిమదిశలో కదులుతూ పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రల మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ఏపీలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రా, యానాంలలో బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తాంధ్రాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు ఓ మోమస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
దక్షిణ కోస్తాంధ్రాలో బుధ, గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రాయసీలమలో బుధ, గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.