AP Weather: ఏపీలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు, ఆ జిల్లాలకు అలర్ట్, మత్స్యకారులకు హెచ్చరిక
అమరావతి: తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడటం లేదు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని స్పష్టం చేసింది.

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
మధ్య బంగాళా ఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ. దీని ప్రభావంతో శనివారం నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అల్పపీడనం అనంతరం తదుపరి 48 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు ఉత్తరాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.

కోస్తాంధ్ర మత్స్యకారులకు హెచ్చరికలు
అల్పపీడన ప్రభావంతో పశ్చిమ బంగాల్, ఒడిశా తీరం వెంబడి గంటకు 55 -65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశాతో పాటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలోని మత్స్యకారులు మంగళవారం వరకు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. సెప్టెంబర్ 12,13 తేదీల్లో ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
Recommended Video

ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
శనివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఆదివారంనాడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వానలు కురుస్తాయి. మంగళవారంనాడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని లోతట్టు గ్రామాలు జలమయమవుతున్నాయి, అనేక గామాల్లో రోడ్లు వరదనీటికి ధ్వంసమయ్యాయి. దీంతో రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక, చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. భారీగా వరద నీరు వస్తుండటంతో ఇప్పటికే పలు ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేశారు.












Click it and Unblock the Notifications