AP weather: మరో అల్పపీడనం, ఏపీలో మళ్లీ భారీ వర్షాలు, ఆ జిల్లాల్లో అలర్ట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో రాయలసీమ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికీ అనేక గ్రామాలు వరద ముంపులోనే మగ్గుతున్నాయి. దీని నుంచి బయటపడక ముందే.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ ప్రకటించింది.

మరో అల్పపీడనం.. ఉత్తరకోస్తాలో తేలికపాటి వర్షాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జారీ చేసిన తాజా వాతావరణ హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. రాయలసీమ జిల్లాలు వరద ముప్పు నుంచి తేరుకోకమునుపే అల్పపీడనం రూపంలో మరోముప్పు పొంచివుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నవంబర్ 29 నాటికి దక్షిణ అండమాన్ వద్ద బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ తరువాత 48 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించొచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందన్నారు.

దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలతోపాటు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక శనివారం నాడు రాష్ట్రమంతటా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. కాగా, అనంతపురం, చిత్తూరు, కడప, నెల్లూరులో హై అలెర్ట్ ప్రకటించారు అధికారులు. మరోవైపు, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చెన్నై సహా తమిళనాడు తీరప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నైలోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రాంతీయ కార్యాలయం తెలిపింది. ఈ వాయుగుండం సోమవారం నాటికి అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.

తమిళనాడు తీరంతోపాటు ఏపీ తీర ప్రాంతాల్లో వర్షాలు
రానున్న 24 గంటల్లో చెన్నైతోపాటు పరిసర జిల్లాల్లో వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం చీఫ్ బాలచంద్రన్ తెలిపారు. రానున్న 48 గంటల్లో చెన్నైలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో తుఫాను సర్క్యులేషన్ విస్తరిస్తున్నందున కొమోరిన్, శ్రీలంకను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ తెలిపింది. నవంబర్ 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. పక్కనే ఉన్న జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

తమిళనాడు తీర ప్రాంత జిల్లాలకు భారీ వర్ష సూచన
నవంబర్ 29వతేదీ వరకు తమిళనాడులోని తూత్తుకుడి, కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు, చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, తేని, మధురై, పుదుక్కోట్టై, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ శనివారం విడుదల చేసిన వెదర్ బులెటిన్లో స్పష్టం చేసింది. ఐఎండీ డేటా ప్రకారం.. నవంబర్ 25 న చెన్నైలో సగటున 55 మిమీ వర్షం కురిసింది. నవంబర్ 26 సాయంత్రం 4.30 గంటల వరకు 32.5 మిమీ వర్షం కురిసింది. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) వర్షపు నీటిని తొలగించేందుకు నగరం అంతటా 750 కంటే ఎక్కువ హెవీ డ్యూటీ పంపులను నిర్వహిస్తోంది. నీటి ఎద్దడిని తక్షణమే తొలగించేందుకు పంప్ ఆపరేటర్లందరూ మోటార్ల దగ్గర విధులు నిర్వహించాలని జీసీసీ ఆదేశించినట్లు జీసీసీ కమీషనర్ గగన్దీప్ సింగ్ బేడీ తెలిపారు. పులియంతోప్ సహా చెన్నైలోని వరద ప్రభావిత ప్రాంతాలను బేడీతో కలిసి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరిశీలించారు. నవంబర్ మొదటి వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు నగరవాసులను అతలాకుతలం చేస్తున్నాయి. చెన్నై దాని పరిసర జిల్లాలైన తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టులో వరుసగా 56 శాతం నుంచి 67 శాతం వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications