కాకినాడలో కీచక ప్రిన్సిపాల్-కరోనా మందులంటూ నిద్రమాత్రలిచ్చి రేప్-మహిళా కమిషన్ తీవ్రచర్యలు
ఏపీలో కాకినాడ జిల్లా కాకినాడలో తాజాగా మైనర్ బాలికపై చోటు చేసుకున్న రేప్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. కరోనా మాత్రలంటూ నిద్రమాత్రలు ఇచ్చి వసతి గృహంలో బాలికపై వరుసగా అఘాయిత్యాలకు పాల్పడటం చర్చనీయాంశమైంది. దీనిపై మహిళా కమిషన్ ఇవాళ తీవ్రంగా స్పందించింది.
వసతిగృహంలో ఉంటూ చదివే విద్యార్ధినిపై ప్రిన్సిపాల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ భగ్గుమంది. ఈ విషయం వెలుగులోకి రాగానే కాకినాడ ఎస్పీతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. కాకినాడలోని కొండయ్యపాలెం హెల్పింగ్ హ్యాండ్స్ వసతిగృహంలో 15ఏళ్ల విద్యార్ధిని ఉంటూ సమీప పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కరోనా మందుల పేరిట విద్యార్ధినితో నిద్రమాత్రలు మింగించి ప్రిన్సిపాల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన సంగతి వెలుగులోకి రాగానే, రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కాకినాడ ఎస్పీతో ఘటనపై ఆరాతీశారు.
కాకినాడ ఏరియాను మహిళా కమిషన్ తరఫున పర్యవేక్షించే కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ ని స్థానిక అధికారులను అప్రమత్తం చేసి.. బాధితురాలి వైద్యసహాయాన్ని పర్యవేక్షించాలని సూచించారు. ఈమేరకు వాసిరెడ్డి పద్మ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన కొద్దిగంటల్లోనే హెల్పింగ్ హ్యాండ్స్ ప్రిన్సిపాల్ విజయకుమార్ ను అరెస్టు చేశారు. అతనిపై పోక్సోకు మించిన సెక్షన్లతో కఠినచర్యలు చేపట్టాలని వాసిరెడ్డి పద్మ ఆదేశాలిచ్చారు. వారం రోజుల్లో చార్జిషీట్ ను కోర్టులో దాఖలు చేసి నిందితుడికి కఠిన శిక్ష అమలయ్యేలా చూడాలన్నారు. మహిళలు, బాలికల వసతిగృహాల పర్యవేక్షణను ఏ ఒక్కరి చేతిలో ఉంటే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని.. ఇద్దరు ముగ్గురు బృందంతో పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాల్సిన ఆవశ్యకత ఉందని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు.