చిరంజీవికి చెప్పా, పవన్కళ్యాణ్ను అనాలని కాదు: హోదాపై రోజా, ఏపీలో బంద్
హైదరాబాద్: తనకు జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను విమర్శించాలనే ఉద్దేశ్యం ఏమీ లేదని... అయితే పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ప్రజల్లోకి రావడం సరికాదని వైసిపి మహిళా ఎమ్మెల్యే రోజా అన్నారు.
మంగళవారం నాడు ఆమె ఓ టీవీ ఛానల్లో మాట్లాడారు. తాను ఎన్టీఆర్ అభిమానిని అని, ఆయన ప్రజల్లో ఉన్నారని చెప్పారు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు తాను అదే చెప్పానని, పూర్తి సమయం ప్రజల కోసం పని చేస్తే రావాలని సూచించానని చెప్పారు.
కానీ, నిన్న ప్రజారాజ్యం, నేడు జనసేన పార్టీలు అప్పుడప్పుడు ప్రజల్లోకి రావడం సరికాదన్నారు. తనకు పవన్ కళ్యాణ్ను విమర్శించాలనే ఉద్దేశ్యం ప్రత్యేకంగా లేదని అభిప్రాయపడ్డారు.
ఏపీకి ప్రత్యేక హోదా కేంద్రం దయ, మన ప్రాప్తి అన్నారు. ప్రత్యేక హోదా మనకు వచ్చే అధికారిక హక్కు అన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జగన్ను విమర్శించే వారు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ప్రత్యేక హోదా కోసం అందరు కలిసి పోరాడాలన్నారు. కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ... రాహుల్ గాంధీ విమర్శించాకే జగన్ బయటకు వచ్చి ప్రత్యేక హోదా కోసం ధర్నా చేశారని ట్విస్ట్ ఇచ్చారు.
కాగా, ఏపీ ప్రజల ఆవేదన మీకు అర్థం కాదా? ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదా కొనసాగిస్తున్నప్పుడు ఏపీకి ఎందుకివ్వరు.. ఇస్తే మీకొచ్చే నష్టం ఏమిటో చెప్పాలంటూ కేంద్రాన్ని, ఏపీ సీఎం చంద్రబాబును వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలో ధర్నా చేశారు.

14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపి ప్రత్యేకహోదా ఇవ్వలేమంటున్నారని, అసలు ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం ఆర్థిక సంఘానికి ఎక్కడుందన్నారు. వేలాది కిలోమీటర్లు దూరం నుంచి వచ్చి ధర్నా చేస్తున్న ప్రజల ఆవేదన కేంద్రం అర్థం చేసుకోవాలన్నారు. సీమాంధ్రకు జరిగే అన్యాయం తనకు తెలుసునని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారన్నారు.
ఏపీలో బంద్
ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ సీపీఐ ఇచ్చిన ఏపీ బంద్ సోమవారం ప్రారంభమైంది. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ బంద్కు కాంగ్రెస్, సీపీఎం, వైసీపీ తదితర పార్టీలతో పాటు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు పలికాయి.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలతో పాటు, వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లోని థియేటర్లు మార్నింగ్ షోను రద్దు చేశాయి.
నేటి ఉదయమే రోడ్లపైకి వచ్చిన సీపీఐ నేతలు తమకు కనిపించిన వాహనాలను అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోలు దాటి బయటకు రాలేదు. బంద్ నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలు మోహరించారు.












Click it and Unblock the Notifications