మొన్నటిదాకా టీడీపీ..ఇక బీజేపీ: జెడ్పీ ఎన్నికల నోటిఫికేషన్పై ఏపీ హైకోర్టులో పిటీషన్
అమరావతి: రాష్ట్ంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నగారా మోగిన వేళ.. ఆ ఎన్నికల నిర్వహణను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా.. మిగిలిన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ.. ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ఈ మధ్యాహ్నం విచారణకు రానుంది. ఈ నెల 8వ తేదీన పోలింగ్ నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమాయాత్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటీషన్ దాఖలు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పరిషత్ ఎన్నికలను నిర్వహించడానికి కొత్తగా బాధ్యతలను స్వీకరించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ గురువారం నాడే నోటిఫికేషన్ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ నెల 8వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. 10వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నీలం సాహ్నీ ఈ ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, సీపీఎం మినహా మరెవరూ హాజరు కాలేదు. ప్రతిపక్ష తెలుగుదేశం, బీజేపీ, దాని మిత్రపక్షం జనసేన పార్టీ ఈ సమావేశాన్ని బహిష్కరించాయి.
ఆ వెంటనే- ఏపీ బీజేపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది ఎక్కడైతే పరిషత్ ఎన్నికల ప్రక్రియ స్తంభించిపోయిందో.. అక్కడి నుంచే పునఃప్రారంభించేలా ఎస్ఈసీ నీలం సాహ్నీ నిర్ణయం నోటిఫికేషణ్ విడుదల చేశారు. దీని పట్ల బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియను మళ్లీ మొదటి నుంచీ చేపట్టాలనేది వారి డిమాండ్. అదే విషయాన్ని వారు తమ హౌస్ మోషన్ పిటీషన్లో పొందుపరిచినట్లు చెుబుతున్నారు. శనివారం నుంచి ఏపీ హైకోర్టుకు వరుసగా మూడు రోజుల పాటు సెలవు ఉన్నందున.. ఈ పిటీషన్ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. కాస్సేపట్లో వాదనలను చేపట్టనుంది. బీజేపీతో పాటు మరో ముగ్గురు అభ్యర్థులు ఈ పిటీషన్ దాఖలు చేశారు.