Pawan Kalyan: వైసీపీ-జనసేన గొడవలో తలదూర్చని బీజేపీ నేతలు: కటీఫ్ అయినట్టేనా?
అమరావతి: ఈ శుక్రవారం థియేటర్ల ముందుకు రాబోతోన్న సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయ దుమారానికి దారి తీసింది. గంటగంటకూ మలుపులు తిరుగుతోంది ఈ వివాదం. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ-జనసేన మధ్య నిన్నటిదాకా మాటల యుద్ధం నడిచింది. ప్రెస్ మీట్స్ పెట్టి మరీ పవన్ కల్యాణ్పై ధ్వజమెత్తారు ఒకరిద్దరు మంత్రులు. రిపబ్లిక్ మూవీ ఫంక్షన్లో తమపై చేసిన విమర్శలకు సమాధానం ఇచ్చారు. చెలరేగి ఘాటుగా బదులు ఇచ్చారు.
యంగ్ బ్లడ్: కాంగ్రెస్లోకి జెఎన్యూ మాజీ స్టూడెంట్స్ లీడర్: ఈ మధ్యాహ్నమే
కులాన్ని సైతం తీసుకొచ్చి..
రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్.. కులాన్ని సైతం తీసుకొచ్చారు. రెడ్డి సామాజిక వర్గంపై విమర్శలు గుప్పించారు. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ను రాజకీయ కార్యక్రమంగా మార్చారనే విమర్శలను పవన్ కల్యాణ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడానికి అది సరైన వేదిక కాదనే వాదనలు వినిపించాయి.
ఫిల్మ్ ఛాంబర్ నుంచీ
పవన్ కల్యాణ్ అదుపు తప్పి మాట్లాడారని, ఆయన ప్రసంగంతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని ఏపీ-తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా తేల్చి చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఇబ్బందులను ఎదుర్కొందని, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రభుత్వాల మద్దతు ఇప్పుడు తక్షణ అవసరమైందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వంతో ఇండస్ట్రీకి ఉన్న సత్సంబంధాలను దెబ్బతీసే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం చేసింది.
మిత్ర పక్షం కూడా
ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోక ముందే పవన్ కల్యాణ్కు మరో విఘాతం తగిలింది. జనసేన మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఎలాంటి మద్దతు అందట్లేదు. పవన్ కల్యాణ్-వైఎస్సార్సీపీ మధ్య చోటు చేసుకుంటోన్న ఈ గొడవలో తల దూర్చడానికి బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు ఏ మాత్రం ఆసక్తిగా ఉన్నట్లు కనిపించట్లేదు. ఇప్పటిదాకా బీజేపీకి చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా ఈ విషయంలో పవన్ కల్యాణ్కు మద్దతుగా లేరు.
పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయంగా..
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల అనంతరం చోటు చేసుకుంటోన్న రాజకీయ దుమారాన్ని బీజేపీ రాష్ట్రశాఖ పరిగణనలోకి తీసుకోలేదు. దీన్ని బట్టి చూస్తోంటే ఈ వ్యవహారం మొత్తం పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయంగా భావిస్తోందే తప్ప పార్టీపరంగా తీసుకోవట్లేదు. మిత్రపక్షం అయినప్పటికీ- వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న రాజకీయ మిత్రుడిని ఆదుకోవడానికి ముందుకు రావట్లేదు. ఇందులో జోక్యం చేసుకోవడం వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండబోదని బీజేపీ నాయకులు ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చారని భావిస్తున్నారు.
తెగతెంపులేనా?
తన రాజకీయ మిత్రుడు ఇబ్బందుల్లో ఉన్న ఈ పరిస్థితుల్లోనూ బీజేపీ నాయకులు ముందుకు రాకపోవడం చర్చనీయాంశమౌతోంది. ఆయనను డిఫెండ్ చేసే ప్రయత్నం కూడా చేయట్లేదు. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తమ రాజకీయ ఎదుగుదలకు ఎలాంటి ఉపయోగం ఉండట్లేదని బీజేపీ నాయకులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. పవన్ కల్యాణ్కు లక్షలాదిమంది అభిమానులు ఉన్నప్పటికీ- అది సినిమాలకు మాత్రమే పరిమితమైందని అంటున్నారు.
స్థానిక ఎన్నికల్లో ఘోరంగా..
బీజేపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిందే స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా. అదే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయాయి. గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు.. ఇలా ఏ ఒక్క స్థాయిలోనూ అధకార పార్టీని సమర్థవంతంగా కాదుకదా.. కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయాయి. దీనితో పొత్తు బెడిసికొట్టినట్టే అయిందని అంటున్నారు. జనసేన పార్టీతో పొత్తును కొనసాగించడం వల్ల ఉపయోగం లేదనే నిర్ణయానికి వచ్చినట్టేనని తెలుస్తోంది.