"నోట్ల రద్దు పెద్ద కుంభకోణం.. చంద్రబాబుకు భాగస్వామ్యం"
ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని ఓ భారీ కుంభకోణంగా అభివర్ణించారు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి ఆరోపించారు.
విజయవాడ : ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని ఓ భారీ కుంభకోణంగా అభివర్ణించారు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి ఆరోపించారు. ఈ కుంభకోణంలో సీఎం చంద్రబాబు నాయుడికి కూడా భాగస్వామ్యం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకులు, ఏటీఎం క్యై లైన్లలో నిలబడి చనిపోతున్న సామాన్యుల కుటుంబాలకు రూ.25లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
సోమవారం నాడు భారత్ బంద్ నేపథ్యంలో.. విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించాయి కాంగ్రెస్ శ్రేణులు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన రఘువీరా.. ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులకు వందల కోట్లు అప్పులు ఎగ్గొట్టిన సుజనా చౌదరి కేంద్రంలో మంత్రిగా ఉండవచ్చా? కష్టపడి దాచుకున్న సొమ్ము తీసుకోవడానికి సామాన్యుడు మాత్రం క్యూలో నిలబడి చనిపోవాలా? అని ప్రశ్నించారు. నోట్ల రద్దు వల్ల చోటు చేసుకున్న మరణాలకు మోడీనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
మోడీని దుయ్యబడుతూ.. ఆయన్ను 21వ శతాబ్డపు తుగ్లక్ గా అభివర్ణించిన రఘువీరా.. చంద్రబాబు తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.