వైఎస్ భారతికి అండగా వైఎస్ షర్మిల ! ఎమోషనల్ ట్వీట్..!
ఆస్తుల విషయంలో అన్న వైఎస్ జగన్, వదిన వైఎస్ భారతితో విభేదిస్తున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఇవాళ మరో విషయంలో మాత్రం వారికి అండగా నిలిచారు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో వదిన వైఎస్ భారతికి షర్మిల మద్దతు ప్రకటించారు. అంతే కాదు షర్మిలపై ఇలాంటి వ్యాఖ్యల వీడియోను చిత్రీకరించి షేర్ చేసిన యూట్యూబ్ ఛానల్ పైనా ఫైర్ అయ్యారు.
భారతి రెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని షర్మిల ఇవాళ ట్వీట్ చేశారు. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం అన్నారు. ఈ సైకో గాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదన్నారు. తప్పుడు కూతలు కూసిన వెధవలను, రేటింగ్స్ కోసం ఎంటర్ టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందే అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నా అన్నారు.

సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదని షర్మిల తెలిపారు. పార్టీ వాళ్లైనా, ఎంతటి వాళ్లైనా శిక్ష పడాల్సిందేనన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉందని, ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ,టీడీపీలే అన్నారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శమన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉచ్ఛం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారని విమర్శించారు. రక్త సంబంధాన్ని మరిచారన్నారు.
రాజకీయ కక్ష్యతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారని, మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందారని షర్మిల గుర్తుచేసుకున్నారు. అన్యం పుణ్యం ఎరుగని పసి పిల్లలను సైతం గుంజారన్నారు. అక్రమ సంబంధాలు అంటగట్టారని, మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారని వారికి గుర్తుచేశారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని కోరారు.












Click it and Unblock the Notifications