నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు-ఒక్కరు చనిపోయినా..కూటమికి షర్మిల వార్నింగ్ !
ఏపీలోని నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు ఇవాళ్టి నుంచి నిలిచిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు దాదాపు రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టిందని, దీంతో ఆస్పత్రులు నడపలేక వైద్య సేవలు నిలిపేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. రూ.3500 కోట్ల బకాయిలపై ఇటీవల జిల్లా కలెక్టర్లకు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. పేరుకు రైజింగ్ స్టేట్ అని.. కానీ వైద్య సేవలకు దిక్కులేదన్నారు. పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భరోసా లేదని ఆరోపించారు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వానిది అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఆరోగ్య శ్రీ సేవల కింద రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటన్నారు.

గత 9 నెలలుగా పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేయకుండా.. వైద్య సేవలు ఆపేదాకా చూడటం అంటే.. ఆరోగ్యశ్రీ పై సర్కారుకున్న చిత్తశుద్ది ఏంటో అర్థమౌతుందన్నారు. పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమే ఇదంతా అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచే ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీగా మారిందన్నారు. పేదోడికి వైద్యం అందని ద్రాక్ష అయ్యిందని విమర్శించారు. వైద్య సేవలను విస్తృత పరుస్తామని, వైద్యానికి గ్లోబల్ సిటీగా చేస్తామని గొప్పలు చెప్పే చంద్రబాబు గారు.. ముందు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలని ఆమె కోరారు.
ఏ ప్రభుత్వం బకాయిలు పెట్టినా అవి చెల్లించాల్సిన బాధ్యత మీదే అని తెలుసుకోవాలన్నారు. వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవాలన్నారు. తక్షణం వైద్య సేవలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందక ఏ ఒక్కరూ మృతిచెందినా.. అవి కూటమి ప్రభుత్వం చేసిన హత్యలే అవుతాయని గుర్తుపెట్టుకోవాలన్నారు. పేదవారి ఆరోగ్యానికి సంజీవనిలా మారిన ఆరోగ్య శ్రీ పథకానికి ..ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని .. కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications