త్వరలో ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పాదయాత్ర- 100 రోజుల్లో 1500 కి.మీ మేర-వైఎస్ బాటలో
ఏపీలో 2014లో జరిగిన రాష్ట్రవిభజనతో జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కనీసం కౌన్సిలర్, సర్పంచ్ సీటు కూడా గెల్చుకునే పరిస్దితుల్లో లేదు. ఇదే పరిస్దితి కొనసాగితే భవిష్యత్తులో నామరూపాల్లేకుండా పోయేలా కనిపిస్తోంది. దీంతో పార్టీని బతికించుకునేందుకు ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు.
గతంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రజాప్రస్ధానం పాదయాత్ర విజయవంతం కావడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టింది. అనంతరం 2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలోనే పాదయాత్ర చేసిన చంద్రబాబు టీడీపీని అధికారంలోకి తెచ్చారు. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ కూడా పాదయాత్రతో 2019లో భారీ మెజారిటీతో ఆధికారంలోకి వచ్చారు. ఇలా వరుసగా పాదయాత్రలతోనే నేతలు అధికారంలోకి వస్తుండటంతో ఇప్పుడు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడం లేదా కనీసం ఉనికి చాటడం కోసం శైలజానాథ్ కూడా పాదయాత్ర చేపట్టబోతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే ఈ పాదయాత్రకు మే చివరి వారంలో శ్రీకారం చుట్టేందుకు శైలజానాథ్ ప్రయత్నాలు చేస్తున్నారు.తొలి విడతగా 100 రోజుల్లో 1500 కిలోమీటర్లు నడిచేందుకు ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దారి పొడవునా ప్రజల సమస్యలు వింటూ ఉదయం ..సాయంత్రం బహిరంగ సభలు ఉండేలా క్యాడర్ కు సూచనలు చేయనున్నారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు క్యాడర్ లో నూతనోత్సాన్నింపేందుకే పాదయాత్ర అని నేతలు చెప్తున్నారు. మే చివరి వారంలో అనంతపురం లేదా శ్రీకాకుళం నుంచి శైలజానాథ్ పాదయాత్రను ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే పాదయాత్ర నిర్ణయాన్ని హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లి శైలజానాథ్ అనుమతి తీసుకుంటారని తెలుస్తోంది. హై కమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పాదయాత్రపై ఆయన పూర్తి ఫోకస్ పెడతారు.